కేసీఆర్కి బాబు ఝలక్! ఏపీలో టీ ప్రముఖుల విగ్రహాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలిపారు. తెలంగాణలోని ట్యాంక్ బండ్ పైన కొన్ని పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తామని తెరాస చెబుతున్న విషయం తెలిసిందే. తెరాస వ్యాఖ్యలపై ఏపీ నేతలు, విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెరాస నేత వేణుగోపాల చారి మాట్లాడుతూ.. ట్యాంక్బండ్ పైన విగ్రహాల విషయంలో అందరు రాద్దాంతం చేస్తున్నారని, తాము తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పంపిస్తే ప్రకాశం బ్యారేజీ పైన పెడతారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పైన చంద్రబాబు మంగళవారం స్పందించారు.
ట్యాంక్బండ్ పైన ఏపీ ప్రముఖుల విగ్రహాలు తొలగింపు ఆలోచన సరికాదన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్లో తాము ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో ఇష్టాగోష్టిగా చంద్రబాబు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కష్టాలను చూసే రుణమాఫీ హామీ ఇచ్చానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రుణమాఫీ కోసమే ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి కార్పోరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కమిషన్కు జీఎమ్మార్, సీఈవోగా గంటా సుబ్బారావులను నియమించినట్లు చెప్పారు. ఏ పరిశ్రమ వచ్చినా అన్ని వృత్తుల వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. ప్రాథమిక విద్యలో క్లస్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చునని, అన్ని పథకాలను పారదర్శకంగా ఉంచేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాల కవరేజీకి సంబంధించి ఏ మీడియాకు ఆంక్షలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పత్రికను, ఏ చానల్ను తాము ఆపలేదన్నారు. కాగా, పింఛన్ల పథకానికి ఏపీ ప్రభుత్వం 'ఎన్టీఆర్ భరోసా' అని నామకరణం చేసింది. 50 ఏళ్ళు నిండిన గిరిజనులకు పింఛన్లు అందజేయనున్నారు.