అదిరింది.. బెదిరింది, ప్రణబ్ తిప్పి పంపిస్తారు: లగడపాటి
న్యూఢిల్లీ/హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంతో కేంద్రం అదిరింది.. బెదిరిందని, తాము ప్రజలకు భయపడతాం తప్పితే వ్యక్తులకు కాదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం లగడపాటి విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు తప్పుల తడకగా, గందరగోళంగా ఉందన్నారు. సంప్రదాయాలు పాటించడం లేదని విమర్శించారు.
తాము తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ కాదన్నారు. రాజకీయాల కోసమే ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని అంశాలను పరిశీలించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే రాష్ట్రపతి చూస్తూ ఊరుకోరాన్నారు.
బిల్లును రాష్ట్రపతి లోతుగా పరిశీలించి, గందరగోళంగా ఉన్న దానిని తిప్పి పంపిస్తారన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా నష్టం లేదని, కాంగ్రెసు పార్టీ పైనే ప్రజలు వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విభజన ఉపద్రవం నుండి బయటపడాలన్నదే తన అభిమతమన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కేంద్రం అవిశ్వాసాన్ని ఎదుర్కోలేకపోతోందన్నారు. రాష్ట్రపతికి తాము విభజనపై వాస్తవాలు చెప్పామన్నారు.
డిగ్గీని అడ్డుకుంటాం: అశోక్ బాబు
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను తాము అడ్డుకుంటామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాదులో చెప్పారు. దిగ్విజయ్ రాకను నిరసిస్తూ ఎపిఎన్జీవోలు ట్యాంకుబండు పైన అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు.
రాష్ట్ర విభజనను అసెంబ్లీలో అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు వ్యతిరేకించాలన్నారు. కేంద్రమంత్రులు పార్లమెంటులో అడ్డుకోవాలన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. మరోవైపు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీలకు కితాబిచ్చారు. మిగిలిన వారు అదే దారిలో నడవాలని సూచించారు.