నిజాంను పొగిడే ప్రభుత్వమొద్దు: కిషన్, తాత ఊరిని దత్తత తీసుకున్న లోకేష్
మహబూబ్ నగర్/హైదరాబాద్: నిజాంను పొగిడే ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. కిషన్ మూడేళ్ల క్రితం 2012లో పాలమూరులోని కృష్ణా గ్రామం నుండి తెలంగాణ పోరుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్థులకు కృతజ్ఞత తెలిపేందుకు ఆయన సోమవారం నాడు గ్రామానికి వచ్చారు.
రాష్ట్ర సాధన కోసం పోరుయాత్రను ప్రారంభించిన రోజును పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో బిడ్డలు ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగిందన్నారు. తాము ఏనాడు ఓట్లు, సీట్లతో ముడి పెట్టలేదన్నారు. మజ్లిస్ పార్టీ హైదరాబాదులో గూండాయిజాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
కాగా, కిషన్ రెడ్డి 2012 జనవరి 19వ తేదీన కృష్ణాలో తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించారు. ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆయన యాత్ర కొనసాగింది. కిషన్ రెడ్డితో పాటు నేతలు, మేధావులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రేమ ఎంతో తెలిసింది: డీకే అరుణ
వరంగల్లో నాలుగు రోజులు ఉన్న కేసీఆర్ పాలమూరులో మాత్రం ఒక్కరోజే ఉన్నారని, దీనిని బట్టే ఆయనకు తమ జిల్లా పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సీఎస్ కన్నా ఎమ్మెల్యేలే గొప్ప అని చెప్పిన కేసీఆర్.. విపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. జిల్లాకు తాగునీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు.
తాత ఊరును దత్తత తీసుకున్న లోకేష్
కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. స్మార్ట్ విలేజ్ పథకంలో భాగంగా ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరకును దత్తత తీసుకున్నారు. దీనిపైన మంత్రి అయ్యన్న మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరకు అభివృద్ధితో ముందుకెళ్తుందని, గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications