టీడీపీ గుర్తింపు రద్దుకు ఫిర్యాదు - జగన్ కార్యకర్తలను ఆపకపోతే : దాడి చేయటం తప్పే, కానీ - సజ్జల..!!
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు...వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు. దాడి చేయటం తప్పే అంటూనే..ఆ పరిస్థితికి..ఆ ఆగ్రహానికి కారణం ఎవరో గుర్తించాలని సూచించారు. మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కోరారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పు కాదంటే అదే విషయం చెప్పాలని డిమాండ్ చేసారు.

టీడీపీ రద్దు కోరుతామంటున్న సజ్జల
చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా అని నిలదీసారు. సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు.. టీడీపీ కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదని చెప్పారు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని అని ఎద్దేవా చేసారు.

సీఎం..ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ఇటువంటి దౌర్భాగ్యపు పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నామని... ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తామన్నారు.
టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారన్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారని సజ్జల సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది తమ డిమాండ్ అని సజ్జల స్పష్టం చేసారు.

సహనానికి హద్దు ఉంటుందంటూ
ముఖ్యమంత్రి ఆపుతున్నారనే కార్యకర్తలు సహనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ, సహనానికి ఒక హద్దు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే టీడీపీ లైన్ దాటిందని..ఇదే జరిగితే భవిష్యత్ పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని సజ్జల హెచ్చరించారు. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదన్నారు. పట్టాభి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉందని చెప్పారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసారు.

ఇలా మాట్లాడితే..ఇలాంటివే ఎదురవుతాయంటూ
బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండని సజ్జల పిలుపునిచ్చారు. సీనియర్ మంత్రి బొత్సా సైతం ఇదే రకంగా స్పందించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తే..ఆ వెంటనే తాము తగిన రీతిలో స్పందించాలని వైసీపీ సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో...రానున్న రోజుల్లో ప్రస్తుత పరిణామాలు కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications