ఏదీ ముఖ్యం కాదు! చివరకు బాబూ దిగిరాక తప్పలేదు: తేల్చి చెప్పిన జగన్
అమరావతి: తమకు రాష్ట్ర ప్రయోజనాలు కంటే ఏదీ ముఖ్యం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని, దీనిపై సోమవారం చర్చిస్తామని లోక్సభ స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు.
రాజకీయాలు కాదు
‘రాజకీయ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, ఎవరి తీర్మానం పరిగణనలోకి తీసుకుంటారనేది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పౌరుల హక్కులకు హామీ దొరికిందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా? అన్నదే ముఖ్యం' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
చంద్రబాబు దిగరాక తప్పలేదు
‘ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా చేస్తున్న అవిశ్రాంత పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ దిగిరాకతప్పలేదు' అని జగన్ వ్యాఖ్యానించారు.
ఎట్టకేలకు టీడీపీ మేల్కొంది
‘ప్రత్యేక హోదాపై మేము చేస్తున్న పోరాటాన్ని చూసి ఎట్టకేలకు దేశంతో పాటు టీడీపీ మేల్కొంది. రాజకీయంగా మరో మార్గంలేని, తప్పనిసరి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ మరోసారి అనుసరించింది. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం' అని జగన్ వ్యాఖ్యానించారు.

ఎప్పటికీ ముందుంటాం
అంతేగాక, ‘ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకోసం పోరాటం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుంది' అని జగన్ స్పష్టం చేశారు. గురువారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతోపాటు ప్రాంతీయ, జాతీయ పార్టీల మద్దతు కోరుతూ జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజలకు అండగా ఉండాలని ఆయన పార్టీలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications