ఇక మేం పోరాడుతామని చెప్పాం, కిరణ్తో కలిసే: ఆనం
హైదరాబాద్: ఇన్నాళ్లు ఉద్యోగ సంఘాలు పోరాడాయని, ఇకపై రాజకీయ పార్టీలు సమస్యలపై పోరాడుతాయని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం అన్నారు. సమ్మె నేపథ్యంలో ఉపాధ్యాయ, ఆర్టీసి, విద్యుత్ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. అనంతరం ఆనం విలేకరులతో మాట్లాడారు.
సీమాంధ్రలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఉద్యమంలోకి కొన్ని అసాంఘిక శక్తులు వస్తున్నాయని ఉద్యోగులకు తెలిపామన్నారు. విద్యుత్ సంక్షోభం నుంచి ప్రజలను రక్షించాలని కోరామన్నారు.
పండుగల సమయంలో సమ్మె విరమించాలని కోరినట్లు చెప్పారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకొని సమ్మె ఆపాలని ఉద్యోగులను కోరినట్లు చెప్పారు. వారిని విధుల్లో చేరామని కోరామని, సమస్యలపై రాజకీయ పార్టీలు ఉద్యమిస్తాయని చెప్పామన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో, స్పష్టమైన హామీలు ఎపిఎన్జీవోలు కోరినట్లు తెలిపారు. ఆర్టీసి కార్మికులను కూడా సమ్మె విరమించాలని కోరామన్నారు. ఆసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో తాము కలిసి నడుస్తామని ఈ సందర్భంగా ఆనం తెలిపారు. కాగా, బుధవారం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.