తెరాసలో విలీనం చేయం, తొలగిస్తున్నారు: తమ్మినేని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని తెరాసలో విలీనం చేయాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తమ్మినేని సీతారాం శుక్రవారం అన్నారు. తమ పార్టీ సానుభూతిపరులు అనే పేరుతో పలువురు ఫీల్డు అసిస్టెంట్లు, రేషన్ డీలర్లను తెలుగుదేశం పార్టీ తొలగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేతల పైన చంద్రబాబు విచారణ చేయించగలరా అని సవాల్ చేశారు.
కాగా, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెరాసలో కలిపేందుకు ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారని టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీలే కారణమని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆ అక్కసుతోనే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లు ప్రసారం కాకుండా జగనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. గురువారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మీడియానే కారణమని జగన్ మాట్లాడడం ఆయన అవివేకమన్నారు.
మీడియా వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ మాట్లాడటం చూస్తే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్ల ప్రసారాలను కేసీఆర్ నిలిపివేయడానికి జగనే కారణమని చెప్పక తప్పదన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం చూస్తే జగన్-కేసీఆర్ మధ్య ఉన్న సంబంధాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.
కేసీఆర్తో ఉన్న ఇలాంటి సంబంధాల కారణంగా తెలంగాణలోతమ పార్టీని తెరాసలో విలీనం చేసేందుకు జగన్ తహతహలాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిచేసే శక్తిసామర్ధ్యాలు జగన్లో లేవని ప్రజలు గ్రహించే చంద్రబాబును అధికారంలోకి తెచ్చారన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏమిటో టీడీపీ ప్రభుత్వం నిరూపించిందన్నారు.