Tiger Video: మహారాష్ట్ర నుంచి ఏపీ వరకు పులి ప్రయాణం, తెలంగాణలో టెన్షన్
అర్ధరాత్రి దాటినా ఇళ్ల తలుపులు తీయలేని భయం... పొలాలవైపు వెళ్లాలంటే గుండెల్లో దడ... పసిపిల్లల్ని దగ్గర పెట్టుకుని జాగారం చేసిన గ్రామాలు! తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా ప్రజల నిద్రను దూరం చేసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల చేతికి చిక్కింది. అధికారులను పరుగులు పెట్టిస్తూ, గ్రామస్తుల్లో భయాందోళనలు రేపిన ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ శుక్రవారం రాత్రి విజయవంతంగా ముగిసింది.
తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల చేతికి చిక్కింది. అధికారులను పరుగులు పెట్టిస్తూ, గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేసిన ఈ ఆపరేషన్ శుక్రవారం రాత్రి విజయవంతమైంది. అటవీశాఖ అధికారులు, పుణె నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ నిపుణుల బృందం సమన్వయంతో చేపట్టిన సంయుక్త వ్యూహంలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పెద్దపులిని చాకచక్యంగా బంధించారు.

మహారాష్ట్ర నుంచి గోదావరి జిల్లాల వరకు ప్రయాణం
మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ఈ పెద్దపులి సుమారు వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తోంది. అభయారణ్యాలు, గోదావరి పరీవాహక ప్రాంతాలు, పొలాలు దాటుతూ రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో ఎనిమిది మూగజీవాలను వేటాడింది. దీంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
శిథిల గృహంలోకి చొరబాటు... ఉత్కంఠ క్షణాలు
శుక్రవారం ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల నుంచి కూర్మాపురం గ్రామానికి చేరుకున్న పులి, పాలచర్ల రాజుకు చెందిన శిథిలగృహంలోకి ప్రవేశించింది. పులి గాండ్రింపులతో గ్రామస్తులు బెంబేలెత్తారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో కొంతసేపు ఆపరేషన్కు ఆటంకాలు ఎదురయ్యాయి.
పొలాల మీదుగా పరుగు... పశువుల పాకలో విశ్రాంతి
మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, శుక్రవారం మధ్యాహ్నం 1.30 సమయంలో పులి శిథిలగృహం నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి వరి పొలాల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామ శివారులోని ఇళ్ల సమీపానికి చేరింది. ఓ కానిస్టేబుల్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికి దుర్గమ్మ గుడి సమీపంలోని కొలగాని సత్తిబాబుకు చెందిన పశువుల పాకలోకి చేరిన పులి, సాయంత్రం వరకు దాదాపు ఐదు గంటలపాటు అక్కడే విశ్రాంతి తీసుకుంది.
వ్యూహాత్మకంగా వలలు... మత్తెక్కిన పులి
పులి కదలికలను ముందుగానే అంచనా వేసిన నిపుణులు రెండు నుంచి మూడు ప్రాంతాల్లో వలలు ఏర్పాటు చేసి, మత్తు ఇంజక్షన్ గన్లతో సిద్ధమయ్యారు. పాక చుట్టూ, భవనాల మధ్య వలలు వేశారు. ఈ క్రమంలో పాకలో ఉన్న రెండు గేదెలపై పులి దాడికి ప్రయత్నించినా అవి తీవ్రంగా ప్రతిఘటించాయి. పులి బయటకు వచ్చిన సమయంలో మొదటిసారి ఇచ్చిన మత్తు ఇంజక్షన్ విఫలమైంది. అయితే వంద మీటర్ల దూరం వెళ్లిన తర్వాత రెండోసారి ప్రయోగించగా మత్తెక్కి చెరువుగట్టు వద్ద కుప్పకూలింది.
విశాఖ జూపార్క్కు!
మత్తెక్కిన పులిని బోనులో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రం (జూపార్క్)కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు యోచిస్తున్నారు.
250 కిలోమీటర్ల సంచారం... ఇంకా ఆందోళన
తెలంగాణలోని జనగామ జిల్లాలో కూడా పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అటవీశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ పెద్దపులి మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించింది. దట్టమైన అడవులు లభించకపోవడంతో ఎక్కడ ఆవాసం ఏర్పరచుకోవాలో తెలియని పరిస్థితుల్లో అటూఇటూ తిరుగుతోంది. గత 50 ఏళ్లలో జనగామ, యాదాద్రి జిల్లాల్లో పెద్దపులి కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటీవలి రోజుల్లో కొలనుపాక, లింగాలఘనపురం, రఘునాథపల్లి, నర్మెట మండలాల పరిసరాల్లో పశువులపై దాడులు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉదయం రెండు దూడలపై దాడి చేసి చంపి తినేసింది పులి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి అడవుల్లోనూ అలజడి
ఇదిలా ఉండగా, నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో కూడా పెద్దపులి సంచారం ఉందన్న ప్రచారం నెలలుగా సాగుతోంది. బండగానపల్లి, దుత్తలూరు అటవీ సమీపంలో ఇటీవల పశువుల మృతి ఘటనలు చోటుచేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఉదయగిరి దుర్గం కొండకు ఆనుకుని ఉన్న దుర్గంపల్లి గ్రామ ప్రజలు "ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియక భయంతో బతుకుతున్నాం" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు సంఘటన స్థలాలను పరిశీలించి, పులి దాడి జరిగిందా లేదా అన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications