YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
ఏపీలో భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇటు సీఎం వైఎస్ జగన్ తో పాటు అటు చంద్రబాబుకూ వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. నానాటికీ పెరుగుతున్న జనం అంచనాలే ఇందుకు కారణం.
ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో వనరులు సరిపోవని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. అప్పులు తెచ్చి మరీ అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇవే అధికారాన్ని అందిస్తాయని జగన్ నమ్ముతున్నారు. అదే సమయంలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విపక్ష నేత చంద్రబాబు కూడా రేపు గెలిస్తే ఈ పథకాలను కొనసాగించక తప్పని పరిస్ధితి. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు నుంచి ఈ పథకాల లబ్దిదారులు ఏం కోరుకుంటున్నారో ఓసారి చూద్దాం..

ఏపీలో పథకాల పందేరం
ఏపీలో ప్రస్తుతం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కచ్చితంగా దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇందులో ఒకటీ అరా పథకాల్ని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నా మిగతా పథకాల జోలికెళ్లేందుకు సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ పథకాల ద్వారా రాజకీయంగా వైసీపీ సర్కార్ కు జరుగుతున్న లబ్దిపైనా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ పథకాల ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తున్నారంటూ విపక్షాలతో పాటు కేంద్రంని ఎన్డీయే సర్కార్ సైతం గగ్గోలు పెడుతోంది.అయినా వైసీపీ సర్కార్ మాత్రం వీటిపై వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఈ పథకాలు కీలకంగా మారబోతున్నాయి.

పెరిగిపోతున్న అంచనాలు
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ది చేకూరుతోంది. వీటి ద్వారా చెల్లించే మొత్తాలు కూడా ప్రతీ లబ్దిదారునికీ రూ.2750 నుంచి మొదలుపెట్టి లక్ష రూపాయల వరకూ లబ్ది చేకూరుస్తున్నాయి. దీంతో ఈ పథకాల ద్వారా వచ్చే మొత్తాలతో జనం ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా భవిష్యత్తులోనూ ఈ పథకాలు కొనసాగాలనే ఆయా లబ్దిదారులు కోరుకుంటున్నారు. అయితే ఇవే మొత్తాలు కాకుండా మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు క్షేత్రస్ధాయిలో పరిస్దితి గమనిస్తే అర్ధమవుతోంది. అయితే పెంచే పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉందా అంటే కచ్చితంగా లేదు. ఈ సమీకరణమే చాలా లెక్కల్ని మార్చేలా కనిపిస్తోంది.

జగన్ సర్కార్ కు లబ్దిదారుల డిమాండ్లు
వైసీపీ ప్రభుత్వం హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఇస్తున్న మొత్తాలు పెరగాలని అత్యధికశాతం లబ్దిదారులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొంత మంది మాత్రం ఇచ్చిందే చాలంటున్నారు. మిగిలిన వారు తమకు గతంలో ఇచ్చి ఇప్పుడు తీసేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. వీరిలో సంక్షేమ పథకాల మొత్తం పెరగాలని కోరుకుంటున్న వారిని పరిశీలిస్తే.. ఉదాహరణకు జగన్ సర్కార్ రాగానే అప్పటికే చంద్రబాబు ఇస్తున్న 2 వేల పెన్షన్ స్ధానంలో కేవలం 250 మాత్రమే పెరిగి 2250 అయింది. ఇప్పుడు అది రూ.2750కు మాత్రమే చేరింది. అంటే ఏడాదికి కనీసం 250 రూపాయలు అయితే పెరిగింది. కానీ మరోసారి జగన్ కు ఓటేయాలంటే ఈ మొత్తాన్ని 3 వేల నుంచి 5 వేలకు పెంచాలని కోరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాగే ప్రతీ పథకం మొత్తం పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్లీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పథకాల కొనసాగింపు ఎలాగూ ఉంటుందని, అటువంటప్పుడు వైసీపీకే ఓటేయాలంటే పెంచాలని లబ్దిదారులు ఎమ్మెల్యేల్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు లబ్దిదారుల డిమాండ్లు
అదే సమయంలో వైసీపీకి బదులుగా టీడీపీకి ఓటేయాలంటే సంక్షేమ పథకాలన్నీ యథాతథంగా కొనసాగిస్తామన్న హామీతో పాటు వాటిని పెంచాలని లబ్దిదారులు కోరుతున్నారు. లేకపోతే టీడీపీకి ఎందుకు వైసీపీకే ఓటేస్తాం కదా అంటున్నారు. దీంతో సంక్షేమ పథకాల మొత్తాల పెంపుకు టీడీపీ కూడా తెరవెనుక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యానిఫెస్టో ఇచ్చే లోపు ఈ పథకాల్లో ఎక్కువ ప్రభావం లేనివి తీసేసి కొత్త పథకాల్ని కూడా తెరపైకి తెచ్చేందుకు టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో లేని వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కొత్త పథకాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా భారీగా సంక్షేమం అందిస్తామన్న భావన లబ్దిదారుల్లో కలిగించాలని టీడీపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications