'11 ఛార్జీషీట్లు దాఖలైనా జగన్పై చర్యల్లేకపోవడంపై డౌట్, టార్గెట్ చంద్రబాబు'
విజయవాడ: అవినీతి కేసుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇంకా చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోమవారం ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులలో జగన్ పైన 11 ఛార్జీషీట్లు దాఖలయ్యాయని గుర్తు చేశారు.
జగన్ జైలుకు వెళ్లకుండా కుట్ర
అయినప్పటికీ ఇంకా చర్యలు తీసుకోలేదని, ఎందుకో చెప్పాలని వర్ల అన్నారు. జగన్ను జైలుకు వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడు సంవత్సరాల క్రితం జగన్ పైన మొదటి ఛార్జీషీటు దాఖలైందని, అయినా ఇప్పటి వరకు విచారణ పూర్తికాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
చంద్రబాబును దెబ్బతీసేందుకే
వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దెబ్బతీసేందుకే జగన్ కేసుల విచారణ జాప్యం చేస్తున్నారని వర్ల దుయ్యబట్టారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసును నిర్వీర్యం చేయడానికి గల కారణాలను తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏ రాజకీయ నేత ఇంత అవినీతికి పాల్పడలేదు
భారత దేశంలో జగన్ వలె ఏ రాజకీయ నాయకుడూ ఇంతటి భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని వర్ల రామయ్య విమర్శించారు. రాజకీయ నాయకులపై అవినీతి కేసులను ఏడాదిలోగా విచారణ చేసి శిక్షిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, జగన్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా జనంలో ఎలా తిరగనిస్తున్నారని ప్రశ్నించారు.
అమరావతికి ఐటీ కంపెనీలు
కాగా, అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా అన్నారు. భవిష్యత్తులో అమరావతి ఐటీ హబ్గా మారుతుందని, సీఎం చంద్రబాబు ముందు చూపు, మంత్రి లోకేశ్ చొరవే దీనికి కారణమన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి పుల్లారావుతో కలిసి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.