పవన్ అభిమాని హత్యలో మరో కోణం : హోటల్ పార్టీలో అసలేం జరిగింది?
బెంగుళూరు : అభిమానం కాస్త ఉన్మాదంగా మారి.. పవన్ కళ్యాణ్ అభిమానిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. సనీ పరిశ్రమతో పాటు సినీ అభిమానులను కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎవరి మీద ఎవరు నిందారోపణలు చేసుకున్నా.. పోయిన ప్రాణం తిరిగిరాలేదన్నది అందరికీ తెలిసిన సత్యమే.
ఇక ఘటన విషయానికొస్తే.. విపరీతాభిమానమే అభిమానుల ప్రాణాల మీదికి తీసుకొస్తుందన్న వాదన లేకపోలేదు. ఏపీ సరిహద్దులో ఉన్న కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు హీరోలకు చాలామంది అభిమానులే ఉన్నారు. సినిమాలు విడుదలైతే చాలు.. పోటాపోటీగా తమ హీరోనే గొప్ప అన్న తరహాలో హంగామా ఏర్పాట్లు చేస్తారు అభిమానులు.
వినోద్ హత్య జరిగిన రోజు అసలేం జరిగింది?
కోలారు పట్టణానికి సమీపంలో ఉన్న నరసాపురంలోని పారిశ్రామిక వాడలో.. అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇదే కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ స్నేహితుడు త్రినాథ్ తో కలిసి హాజరయ్యాడు.
మరో తెలుగు హీరో అభిమాని అయిన సునీల్ ని కూడా నిర్వాహకుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇదే క్రమంలో అవయవదానం గురించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. ప్రసంగం చివరలో ఇలాంటి కార్యక్రమాలు ఏపీలో తాము కూడా చేపడుతామంటూ జై పవన్ కళ్యాణ్ అని ముగించాడు. పవన్ ప్రస్తావన పట్ల సునీల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.
నిర్వాహకుల జోక్యంతో.. ఆ గొడవ అక్కడితో సర్దుమణిగినట్లే కనిపించినా.. అందరు కలిసి పార్టీ చేసుకుందామనే ఉద్దేశంతో సమీపంలోని గేట్స్ గ్రాండ్ హోటల్ కు వెళ్లడంతో సునీల్ వినోద్ ఇద్దరి మధ్య వాగ్వాదం మళ్లీ మొదలైంది. సునీల్ తన స్నేహితుడు అక్షయ్ కుమార్ ను కూడా పార్టీకి ఆహ్వానించడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో.. ఆగ్రహావేశంతో ఊగిపోయిన అక్షయ్, వినోద్ ఛాతీలో కత్తితో పొడిచాడు.
అనుకోని పరిణామంతో ఉలికిపడ్డ సునీల్, త్రినాథ్.. వెంటనే తేరుకుని వినోద్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలో.. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడం.. మరో కారులో తరలించే ప్రయత్నం చేయడంతో.. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన వినోద్ మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచాడు.
మరో కోణం :
పవన్ అభిమాని వినోద్ ప్రాణాలు పోవడానికి అతని అభిమానం మాత్రమే కారణం కాదంటున్నారు కుటుంబ సభ్యులు. వినోద్ కు అమెరికా వీసా లభించిన నేపథ్యంలో.. వీసా రావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వినోద్ స్నేహితులే అతన్ని హత్య చేశారని వినోద్ తల్లి వేదవతి ఆరోపిస్తోంది.