తెరాస వ్యూహం ఏమిటి: బీజేపీతో 'గ్రేటర్' ఫైట్, మోడీతో దోస్తీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి క్రమంగా దగ్గరవుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్ర స్థాయిలో బీజేపీ, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
అదే సమయంలో కేంద్రంలో మాత్రం బీజేపీతో దోస్తీతోనే వెళ్లేందుకు తెరాస ఆసక్తి చూపిస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలని తెరాస, బీజేపీలో భావిస్తున్నాయి.
ఈ కారణంగా ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ నగర నేతలు తెరాస పైన నిప్పులు చెరగడంతో పాటు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు. ఎల్లుండి జీహెచ్ఎంసీ ట్యాక్స్ను నిరసిస్తూ ధర్నా చేపట్టనున్నారు.
వారికి ధీటుగా తెరాస నేతలు స్పందిస్తున్నారు. ఇందుకు గ్రేటర్ ఎన్నికలే కారణమని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. కేంద్రం స్థాయిలో మాత్రం దోస్తీ కోసం తెరాస ఆసక్తి చూపిస్తోంది.
ఇందుకు తెరాస నేతల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా తాము మరో ఇరవై ఏళ్లు కేంద్రంతో దోస్తీగానే ఉండాలని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమె ప్రధాని మోడీని కలిసి సెల్ఫీ దిగారు.
అదే సమయంలో కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన నిప్పులు చెరిగారు. రైతుల ఆత్మహత్యలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటానికి బదులు, ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేసి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒకరోజు పాదయాత్ర చేస్తే సమస్య పరిష్కారం కాదని ఆమె రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి పొందటానికి రైతుల ఆత్మహత్యలను వాడుకోరాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు జరిగాయని గుర్తుచేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసకోవాలని ఆమె కోరారు.
తన నియోజక వర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను ఆమె ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో రక్షణ, విద్యుత్ ఉక్కుశాఖలకు చెందిన ఒక ఉత్పత్తివిభాగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రధానిని కోరినట్లు ఆమె తెలియచేశారు.