ఆ వీడియో ఎవరు తీశారో?...ఎందుకు తీశారో?...కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
Recommended Video

అమరావతి:సోషల్ మీడియాలో వైరల్ గా మారిన "ఢిల్లీలో టిడిపి ఎంపీల సంభాషణ" వీడియోపై ఎపి సిఎం చంద్రబాబు భగ్గుమన్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీశారో?...ఎందుకు తీశారో?...ఎందుకు ప్రసారం చేశారో విచారణ చేయిస్తామని...నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
దీనివెనుక టిడిపి పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర ఉందన్న ముఖ్యమంత్రి...ఉద్యమ పవిత్రతను దెబ్బతీసేందుకే ఇలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే దీక్షల గురించి టీడీపీ ఎంపీలే అపహాస్యం చేస్తున్న దృశ్యంతో కూడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీక్షలు కేవలం బరువు తగ్గేందుకే అన్న అర్థం వచ్చేలా టిడిపి ఎంపీలు మాట్లాడుతూ నవ్వుకోవడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా వినిపించడం సొంత పార్టీలోనే కలకలం సృష్టిస్తోంది.

చంద్రబాబు...ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్
"ఢిల్లీలో టిడిపి ఎంపీల సంభాషణ" ఎపి లో ప్రకంపనలు రేపడంతో ఢిల్లీలో ఉన్న తెదేపా ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన పార్టీ ఎంపీల ఉద్యమంపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని...ఉద్యమంలో అందరూ ఒకేమాట-ఒకే బాటగా ఉండాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. మన పోరాటంపై బురద జల్లేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని...ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ఎంపీ,ఎమ్మెల్సీ దీక్ష...భేష్
కడప స్టీలు ప్లాంట్ కోసం సీఎం రమేశ్, బీటెక్ రవి తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్రం మొత్తం మన ధర్మపోరాటం వైపే చూస్తోందని...దాన్నుంచి ప్రజలను మరల్చడానికే కొందరు తప్పుడు వీడియో క్లిప్పింగ్లు వదులుతున్నారని...వాటిని చిలవలు పలవలు చేసి దుష్ప్రచారానికి తెగబడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.నేతలెవరూ సరదాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దనిహెచ్చరించారు.కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని... ప్రతిపక్షాల అడ్డంకులను అధిగమిస్తూ వారి కుట్రలను భగ్నం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉండాలని హెచ్చరించారు.

ఎవరు తీశారో...కఠిన చర్యలు
అయితే దీనిని ఎవరు తీశారో, ఎందుకు ప్రసారం చేశారో విచారణ చేయిస్తామని.. నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. మన పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర దీనివెనక ఉందన్న ముఖ్యమంత్రి.... ఉద్యమ పవిత్రతను దెబ్బతీసేందుకే ఇలా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యవహారాల్లో మీడియా కూడా సంయమనం పాటించాలని... రాష్ట్రానికి హానిచేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఐదు కోట్ల ప్రజల హక్కులకు నష్టం చేసేవారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీడియా ముసుగులో అరాచక శక్తులు చొరబడకుండా చూడాలన్నారు.

టిడిపి ఎంపీల...ఆవేదన
ఈ వీడియో విషయమై టిడిపి ఎంపీలు సిఎం చంద్రబాబుకు వివరణ ఇస్తూ...పార్లమెంటులో ఆందోళన చేసిన సమయంలో మురళీమోహన్ స్పృహ తప్పి పడిపోయారని... కొనకళ్ల నారాయణకు గుండెపోటు వచ్చిందని... వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడామని ఎంపీలు ముఖ్యమంత్రికి తెలిపారు. అప్పుడు ఎలాంటి ప్రచారం చేయని వారు ఇప్పుడు తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో దివాకర్ రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారని... ఇప్పుడు మురళీమోహన్ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న తాను వారం రోజులు దీక్ష చేయగలను అన్న వ్యాఖ్యలను కత్తిరించి ప్రసారం చేశారని మురళీమోహన్ చెప్పారు. తాను మాట్లాడింది కట్ చేసి వాళ్లకు కావాల్సిన వ్యాఖ్యలు అతికించారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications