Bakrid 2021 : బక్రీద్ త్యాగాల పండుగ ఎందుకంటే ? జంతుబలి నేర్పే పాఠమిదే..
ముస్లింలు ఏడాదిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్ రోజు ఉదయమే నిద్రలేచి, ప్రత్యేక ప్రార్ధనలు పూర్తి చేసుకుని జంతుబలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఇందుకోసం సిద్దం చేసిన జంతువులను పెంచడంతో పాటు అన్నీ ప్రత్యేకతలే కనిపిస్తాయి. చివరికి బక్రీద్ పండుగ ప్రారంభమైన నాటి నుంచి నుంచి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు జంతుబలి ఇవ్వడం ద్వారా చరిత్రలో దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
త్యాగాల పండుగ బక్రీద్
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్ హజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దైవ ప్రకక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలామ్ ఆయన కుమారుడు ఇస్మాయిల్ ను దైవాదేశం ప్రకారం బలిచ్చేందుకు సిద్ధం కావడం, చివరి నిమిషంలో ఆయన త్యాగనిరతికి మెచ్చి ఇస్మాయిల్ ను ఆ దైవమే కాపాడటం వంటి అంశాలు బక్రీద్ ను త్యాగాల పండుగగా మార్చేశాయి. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలామ్ చూపిన మార్గంలో న్యాయం, ధర్మం కోసం తమ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా విశ్వాసంతో ఆయన కుమారుడు బలిదానానికి సిద్ధమైన సందర్భం ముస్లింలకు జీవితకాలం పాటు మార్గదర్శనం చేస్తుంది.
ఖుర్బానీ అంటే ఏంటి ?
దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇచ్చే జంతుబలిని ముస్లింలు ఖురాన్ ప్రకారం ఖుర్బానీగా పిలుస్తారు. అన్ని ప్రేమల కన్నా దైవ ప్రేమే గొప్పది కాబట్టి దాని కోసం అన్నింటినీ త్యాగం చేయాలనేది ఇస్లాం ధర్మం. అందుకే ప్రవక్త ఇబ్రహీంకు లేక లేక కలిగిన కుమారుడు ఇస్మాయిల్ ను బలి ఇవ్వమని దేవుడు ఆదేశిస్తాడు. ఇందులో భాగంగా ప్రవక్తి ఇబ్రహీం ఒకరోజు తన కుమారుడు ఇస్మాయిల్ ను బలిస్తున్నట్లు కలగంటారు. దీన్నే దైవాదేశంగా భావించి ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ కు చెబుతారు. అప్పుడు కుమారుడు కూడా స్వచ్ఛందంగా బలిదానానికి సిద్ధమవుతారు. అప్పుడు కుమారుడిని బలిచ్చేందుకు ఇబ్రహీం సిద్ధం కాగానే కుమారుడి స్ధానంలో గొర్రె ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దాన్ని బలిస్తారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ బక్రీద్ రోజు ఖుర్బానీ పేరుతో గొర్రెల్ని బలివ్వడం ఆచారంగా వస్తోంది.
మూడు భాగాలుగా దానం
దానం అనేది ఇస్లాం మతంలోనే భాగంగా ఉంది. ఎంత దానమిస్తే అంత దేవుడికి ప్రీతిపాత్రులు అవుతారని ముస్లింలు నమ్ముతారు. ఇక్కడ బక్రీద్ సందర్భంగా ఇచ్చే ఖుర్బానీ (గొర్రెపోతు బలి)లోనూ మంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి ఒక భాగం పేదలకు, మరొక భాగం బంధుమిత్రులకు, మిగిలిన మూడో భాగం కుటుంబ సభ్యులు పంచుకుంటారు. అప్పుడు ఆ దానం కూడా అందరికీ చేసిన సంతృప్తి, త్యాగానికి ఫలితం కూడా లభిస్తాయని నమ్ముతారు. అందుకే బక్రీద్ రోజు జరిగే మాంసం పంపకాలు కూడా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నవని వారు భావిస్తారు.
Recommended Video
కాలాలు మారినా..
కాలాలు మారుతున్నా బక్రీద్ సందర్భఁగా ఇచ్చే బలిదానాల్లో కానీ, మాంసం దానంలో కానీ ఏమాత్రం మార్పు రాలేదు. చరిత్రలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగనిరతిని గుర్తు చేసుకుని ఇప్పటికీ ముస్లింలు పండుగ సందర్భంగా బలిదానాలతో పాటు ఇతర ఆచార, సంప్రదాయాలను కూడా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అదే స్ధాయిలో పాటిస్తుంటారు. ముఖ్యంగా ప్రవక్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ పండుగ కాలాలు మారుతున్నా ఇప్పటికీ, ఎప్పటికీ ఎలాంటి మార్పులకూ గురికాలేదు. అందుకే త్యాగం నిరంతరమైనదని, దైవాన్ని మెప్పించేదని ముస్లింలు బలంగా నమ్ముతారు.