వైసీపీ టీచర్ ఎమ్మెల్సీ గెలుపుకు కడప ఆర్జేడీ సాయం ? ప్రతాపరెడ్డిపై దాడి ! ఈసీ విచారణతో చర్చ !
ఏపీలో త్వరలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న అధికార వైసీపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై టీచర్లలో ఉన్న ఆగ్రహం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం కడప ఆర్జేడీగా ప్రతాప్ రెడ్డిని నియమించింది. ఆయన ఇప్పుడు పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్ధిని గెలిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో ఈసీ ఆయనపై విచారణకు ఆదేశించింది.

పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ పోరు
ఏపీలో త్వరలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్దానానికి వైసీపీ, టీడీపీ మద్దతునిస్తున్న అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వైసీపీ నుంచి ఎంవీ రామచంద్రారెడ్డి, ఆపస్ నుంచి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎస్టీయూ నుంచి కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ 1938 యూనియన్ మద్దతుతో చామల అనిల్వెంకటప్రసాద్రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో వైసీపీ అభ్యర్ధి రామచంద్రారెడ్డిని గెలిపించుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కడప ఆర్జేడీ తెరపైకి వచ్చారు.

కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి
పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్.. కడప తాత్కాలిక ఆర్జేడీగా బి. ప్రతాప్ రెడ్డిని నియమించింది. ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా ఉంటారనే ఆరోపణలు ఉన్న ప్రతాప్ రెడ్డిని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన నియామకంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇవి కాస్తా ఎన్నికల సంఘం వరకూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. తాజాగా అనంతపురంలో ప్రతాప్ రెడ్డి ఏర్పాటు చేసిన టీచర్ల భేటీని విపక్ష పార్టీలు అడ్డుకున్నాయి.

వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డి
కడప ఆర్జేడీ బి.ప్రతాప్ రెడ్డి.. వైసీపీ టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న కల్పలతా రెడ్డి భర్త. గతంలో కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన భార్య కల్పనరెడ్డిని గెలిపించుకున్న ప్రతాప్ రెడ్డి.. అప్పట్లో ఉపాధ్యాయులను బెదిరించి,ప్రలోభపెట్టి గెలిపించుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విధానాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతాప్ రెడ్డిని వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి.
ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది.

ప్రతాప్ రెడ్డిపై ఈసీ విచారణ ?
కడప ఆర్జేడీగా ఉంటూ పశ్చిమ రాయలసీమ టీచర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించేందుకు సహకరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఆయన్ను వెంటనే తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల వ్యవహారంలో ప్రతాప్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఒకసారి సమీక్షించామని... మరో మారు సమీక్షించి చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా విపక్షాలకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications