టిడిపికి ఆ భయం: వీరికి జగన్ వద్దు.. పవన్ కళ్యాణ్ ముద్దు! కారణాలు అనేకం!
వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల కావడం లేదని, అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మొరపెట్టుకుంటే తమ సమస్యలు తీరుతాయని ఏపీలో ఎక్కువ మంది భావిస్తున్నారా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల కావడం లేదని, అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మొరపెట్టుకుంటే తమ సమస్యలు తీరుతాయని ఏపీలో ఎక్కువ మంది భావిస్తున్నారా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
దాదాపు గత మూడేళ్లలో పరిస్థితులను చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పవన్ లేవనెత్తిన సమస్యల పైన వెంటనే స్పందిస్తోంది. జగన్ విషయంలో మాత్రం.. ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తే టిడిపి సానుకూలంగా స్పందించింది. అయితే జగన్ యువభేరీలను మాత్రం తప్పుబట్టింది. ఆయన కేవలం రాజకీయ కోణంలో చేస్తున్నాడన్నది టిడిపి వాదన.
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ హోదా విషయంలో ఇదివరకు ప్రధానంగా బీజేపీని నిలదీశారు. జగన్ మాత్రం చంద్రబాబు పైనే నిప్పులు చెరిగేవారు. మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాత్రం బీజేపీతో పాటు టిడిపిని కూడా పవన్ కడిగిపారేశారు.
హోదా ఇస్తామని చెప్పింది బీజేపీ అని, అది కాంగ్రెస్లా ఏపీ ప్రజలను మోసం చేయవద్దని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో, హోదా ఇవ్వలేని బీజేపీతో.. టీడీపీ ఇంకా కలిసి ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దాని గురించి మాట్లాడాలని పవన్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీ ఇబ్బందుల్లో ఉంది. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా బీజేపీకి లేదా కేంద్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఒకటి.. కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు. రెండు బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. దాని వల్ల అది కోల్పోయేది ఏమీ అంతగా ఉండదు.
వీటిని బేరీజు వేసుకొని.. కేంద్రం నుంచి బయటకు వస్తే... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి నష్టమనేది టిడిపి అభిప్రాయం. ఇందులో నిజముందని అంటున్నారు.

హోదాపై మాట్లాడవచ్చు...
జగన్ కూడా ప్రత్యేక హోదాను లేవనెత్తవచ్చునని, కానీ దాని గురించి ప్రధానంగా చంద్రబాబును నిలదీయడాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే ఘాటుగా బీజేపీని ఎందుకు అడగటం లేదని అంటున్నారు. దీనిని బట్టే రాజకీయ లబ్ధి కనిపిస్తోందని అంటున్నారు.

ప్రతిదీ రాజకీయమని..
సమస్యల విషయానికి వస్తే.. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రతి దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని, నిర్మాణాత్మక సలహాలు ఇస్తే పాటిస్తామని టిడిపి చెబుతోంది.

వెంటనే స్పందన
పవన్ రాజధాని భూసేకరణ పైన, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కు పైన, శ్రీకాకుళం ఉద్ధానం కిడ్నీ సమస్య పైన.. ఇలా వరుసగా స్పందించారు. వాటిపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది.

అందుకే పవన్కు కలిశారు!
ఈ కారణంగానే పోలవరం డంప్ బాధిత గ్రామ ప్రజలు, ఉద్దండరాయునిపాలె, లింగాయపాలెం గ్రామ ప్రజలు తాజాగా జనసేన అధినేతని కలిసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ కంటే పవన్ వల్లే సమస్యల పరిష్కారం అంతో ఇంతో లభిస్తున్నట్లుగా కనిపిస్తోందని, అందుకే ఆయనను కలుస్తున్నారంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోను పార్టీ పరంగా పక్కన పెడితే.. రిపబ్లిక్ డే నాడు ఆర్కే బీచ్ నిరసనకు పిలుపునివ్వడంపై ఎక్కువ మంది తటస్థులు పవన్ వైపు నిలబడటం గమనార్హం.

2019 భయం
పవన్ను దూరం చేసుకునే ఉద్దేశ్యం కూడా టిడిపికి లేదు. 2019 ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేస్తానని చెప్పారు. పవన్ను మచ్చిక చేసుకొని అప్పుడు కూడా కలిసి వెళ్లేందుకే టిడిపి సిద్ధంగా ఉంది. తదుపరి ఎన్నికల్లో పవన్ టిడిపికి దూరమైతే ఆ పార్టీకి నష్టమే.

ఆచితూచి స్పందన
ఆ భయంతోనే చంద్రబాబు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. గతంలో ఎంపీలు పవన్ పైన విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అందరు జనసేన అధినేత పైన ఆచితూచి స్పందిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పవన్ టీడీపీపై నిప్పులు చెరిగారు. కానీ టీడీపీ మాత్రం ఇంకా ఆచితూచి స్పందిస్తోంది.












Click it and Unblock the Notifications