Solar Eclipse 2020:ఆరోజున శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే ఎందుకు తెరిచే ఉంటుంది..?
శ్రీకాళహస్తి: సాధారణంగా సూర్యగ్రహణం రోజున దేశంలో అన్ని ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. అయితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ తలుపులు మాత్రం తెరిచే ఉంటాయి. గ్రహణం రోజు అన్ని ఆలయాలు మూసివేసి ఉండగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రమే ఎందుకు తెరుచుకుని ఉంటుంది..?
Recommended Video

గ్రహణం రోజున ప్రత్యేక పూజలు
జూన్ 21న సూర్యగ్రహణం సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని ఆలయాల తలుపులు మూతపడనుండగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ద్వారాలు మాత్రమే తెరిచి ఉంటాయి. గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. వీటితో పాటు రాహు కేతువులకు కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. తమ జాతకంలో దోష నివారణ కోసం భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆళయాన్ని దర్శించుకుంటారు.అది కూడా గ్రహణం రోజున పూజలు చేస్తే దోషం పోతుందని భక్తులు విశ్వసిస్తారు.

కాళహస్తీశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి..?
గ్రహణం రోజున రాహు కేతువు పూజలు నిర్వహించిన తర్వాత శివుడిని ఆరాధిస్తారు భక్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి కవచంలో మొత్తం 27 నక్షత్రాలు 9 రాశిలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మొత్తం సౌర వ్యవస్థ ఆయన నియంత్రణలో ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. 5తలల పాము కేతు.. శివుడి తలను అలంకరిస్తుంది. ఒక తల కలిగిన పాము అమ్మవారి నడుము చుట్టు వడ్డాణంలా అలంకరించి ఉంటుంది. అయితే గ్రహణంతో వచ్చే అరిష్టాలు ఇక్కడ పనిచేయవనేది భక్తుల నమ్మకం.

తిరుమల వెంకన్న ద్వారాలు కూడా బంద్
ఇక తిరుమల వెంకన్న ఆలయం కూడా భక్తుల దర్శనంకు మూసివేయడం జరుగుతుంది. ఏకాంత సేవ కూడా ఆలయతలపులు మూసి నిర్వహిస్తారు. ఇక ఆదివారం ఉదయం అంటే జూన్ 21న మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుమల ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ సమయంలో బంగారు వాకిలి వద్ద శుద్ధి, పుణ్యఃవచనం, తోమాల, కొలువు మరియు పంచాగ శ్రవణంలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలి అర్చన, మొదటి గంట, రెండో అర్చన, రెండో గంట సాయంత్రం 6 గంటల వరకు ఏకాంతంలో జరుగుతాయి.

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం కూడా..
ఇదిలా ఉంటే జూన్ 20వ తేదీనుంచి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం గ్రహణం సందర్భంగా మూసివేయడం జరుగుతుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలంలో ఉంది. అయితే గ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు మూసి ఉంటాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు చెప్పారు. జూన్ 20 నుంచి జూన్ 21 సాయంత్రం 4:30 వరకు ఆలయం మూసివేసి ఉంటుందని చెప్పారు.

గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..
మరోవైపు కర్నూలులోని సైన్స్ సొసైటీ సూర్య గ్రహణం గురించి పలు అంశాలు వెల్లడించింది. జూన్ 21న వచ్చే సూర్యగ్రహణం ఆఫ్రికా, ఆసియా, యూరోప్ దేశాల్లో కనిపించనుండగా... గ్రహణం పూర్తి ఎఫెక్ట్ ఉత్తర భారతంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇది ఆదివారం ఉదయం 10గంటల 25 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణంగా కనిపిస్తుంది. ఇది మధ్యాహ్నం ఒంటి గంట 54 నిమిషాల వరకు కొనసాగుతుందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 26న కూడా సూర్యగ్రహణం దక్షిణ భారత దేశంలో స్పష్టంగా కనిపించడం విశేషం. ఈ సూర్య గ్రహణం తర్వాత మరో గ్రహణం భారత్ నుంచి వీక్షించాలంటే ఒక దశాబ్దం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది 21 మే, 2031లో కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం 20 మార్చి 2034లో వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications