సుప్రీంలో వైసీపీ పిటిషన్ వెనుక ? టార్గెట్ 2024 ఎన్నికలే ! టీడీపీ అంచనాలివే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాలు అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు దాదాపు ఆరునెలలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏం ఆశిస్తోంది, సుప్రీంకోర్టులో రాజధాని పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగితే ఎవరికి ప్రయోజనం, దీనిపై విపక్ష టీడీపీ క్లారిటీ ఇస్తోంది.
సుప్రీంలో అమరావతి పోరు
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిపోయింది. ఇప్పుడు అక్కడ మూడు రాజధానుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభించేలా ఏదో ఒక తీర్పు వస్తుందని వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో హైకోర్టులోనే దాదాపు మూడేళ్లు నలిగిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ జరిపి తీర్పు ప్రకటించే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు.
వైసీపీ కోరుకుంటోంది ఇదే
హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీ సర్కార్.. ముందుగా స్టే ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే లభిస్తే ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులు అయినా తీసుకుని మూడు రాజధానులపై ఒకట్రెండు అడుగులు ముందుకు వేయొచ్చన్న అంచనాలో వైసీపీ సర్కార్ కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో మూడు రాజధానులబిల్లు ప్రవేశపెడతామని చెప్పుకున్నా.. ఇప్పటివరకూ ఆ సంకేతాలు కనిపించడం లేదు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఇవాళ లేదా రేపు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైతే హైకోర్టు తీర్పుపై స్టే కోరాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే సుప్రీంకోర్టు ఏం చెబుతుందనేది కీలకంగా మారిపోయింది. ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు వెంటనే అంగీకరించకపోతే అప్పుడు వైసీపీ సర్కార్ వ్యూహమేంటన్నది తేలాల్సి ఉంది.
టీడీపీ అంచనాలివే...
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు తగినంత సమయం ఉన్నా పట్టించుకోకుండా.. ఆరునెలలు సాగదీసిన ప్రభుత్వం.. ఇప్పుడు హడావిడిగా సుప్రీం తలుపు తట్టడం వెనుక వ్యూహంపై టీడీపీ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఎటూ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పటికిప్పుడు తేలడం అసాధ్యం. హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే సవాల్ చేస్తే విచారణ ప్రారంభమై ఏడాది తర్వాత అయినా తీర్పు వెలువడితే ఎన్నికల ముందు కష్టమే. అందుకే ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికల వరకూ ఈ వ్యవహారాన్ని సాగదీయాలన్నదే వైసీపీ ప్రభుత్వ వ్యూహమని టీడీపీ చెబుతోంది. అందుకే ఈ వ్యవహారంపై సాగతీత ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని వైసీపీ భావిస్తోందని టీడీపీ విశ్లేషిస్తోంది.