జగన్ ఏం సాధిస్తాడు: యనమల, వారిని లాగొద్దని డొక్కా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్లను కలిసి ఏం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గురువారం ప్రశ్నించారు.
తృణమూల్ కాంగ్రెసు, ఎస్పీలు చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని ఎప్పుడో చెప్పాయని, అలాంటప్పుడు ఇప్పుడు వారిని కలవాల్సిన అవసరం ఏముందని, కలిసి సాధించేదేముందన్నారు. విభజనవాది అయిన యుపి మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతిని జగన్ ఎందుకు కలవడం లేదో చెప్పాలన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం, తన దోపిడీకి మిగిలిన పార్టీల ఆమోదమే జగన్ అజెండా అని ఆరోపించారు. జగన్ విషయంలో రాజకీయ పార్టీలు, కోర్టుల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
వారిన లాగొద్దు: డొక్కా
అసెంబ్లీ ప్రోరోగ్ అంశంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్లను వివాదంలోకి లాగవద్దని మంత్రి మాణిక్య వర ప్రసాద్ గురువారం అన్నారు. మీడియాకు సమాచారం లీక్ చేస్తున్న వారి పైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు లేఖ రాస్తానని తెలిపారు.