భర్త తల నరికి, ఆ తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన భార్య; రేణిగుంటలో దారుణ ఘటన
చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. ఆపై ఎలాంటి భయమూ లేకుండా భర్త తల ఒక సంచిలో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన వివరాల్లోకి వెళితే తిరుపతి రేణిగుంట బుగ్గ వీధిలో నివాసముంటున్న 55 సంవత్సరాల రవిచంద్ర భార్య వసుంధర చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్త; పండుగనాడే రోకలి బండతో మోది, పెట్రోల్ పోసి తగులబెట్టిన భార్య
భర్తను హతమార్చిన భార్య .. భర్త తలతో పోలీస్ స్టేషన్ కు
రవిచంద్ర, వసుంధర ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 20 సంవత్సరాల వయసున్న ఒక కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తలమధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్త అన్న విచక్షణ జ్ఞానాన్ని మరచి కత్తితో అతికిరాతకంగా భర్తపై దాడి చేసింది. భర్త తల నరికేసిన తర్వాత ఆ తలను ఓ సంచిలో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల తీసి పోలీసుల ముందు పెట్టింది. ఊహించని సంఘటనకు పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
భర్తను చంపిన భార్య .. పోలీసుల ముందు లొంగుబాటు
తన భర్తను తానే చంపానని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయింది. తాను తన భర్తను హత్య చేశానని పోలీసుల ముందు చెప్పింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలీని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ రక్తపుమడుగులో ఉన్న వసుంధర భర్త రవిచంద్ర మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలంలో హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్ వి వైద్య కళాశాలకు తరలించారు.
భార్య మానసిక స్థితిపై స్థానికుల అనుమానం
ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారిని పోలీసులు విచారించారు. అయితే వసుంధర మానసిక పరిస్థితిపై ఇరుగుపొరుగు వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణాలేవైనా ఇటీవల కాలంలో భర్తలను హతమారుస్తున్న కసాయి భార్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు ఇటువంటి దారుణాలకు మగవాళ్లు మాత్రమే పాల్పడితే, ఇప్పుడు ఆడ వాళ్ళు కూడా అత్యంత దారుణ ఘటనలకు పాలడుతున్నారు.
భర్తలపై దాడులు చేస్తున్న భార్యలు .. ఆందోళనకరంగా పరిస్థితి
తామేమీ తీసిపోము అన్న చందంగా భర్తల పై దాడులకు దిగుతున్నారు. అత్యంత దారుణంగా భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యల తీరు ఆందోళనకరంగా ఉంది. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవాల్సిన వారు, ఆ పని చేయకపోగా హత్యలకు పాల్పడుతున్న తీరు సమాజానికి ఆందోళనకరంగా మారింది. తాజా కేసులో భర్తను హతమార్చిన భార్య కటకటాల పాలు కాగా, అటు తండ్రి లేక, తల్లి జైలు పాలై వారి కుమారుడు అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు.