ప్రియుడంటే మోజు..! భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది..
ఆకివీడు : ఇష్టం లేని పెళ్లి.. పెద్దల బలవంతం మీద పెళ్లయితే చేసుకుంది గానీ ప్రేమించిన ప్రియుడిని మాత్రం మరిచిపోలేకపోయింది. ఇదే క్రమంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇంకేముంది ప్రియుడు రంగంలోకి దిగడం.. ప్రియురాలి భర్తను హతమార్చడం జరిగిపోయాయి.
అయితే నిజం ఎన్నో రోజులు దాగదు కాబట్టి.. అసలు విషయం బయటపడేసరికి ఇప్పుడు ఆ ఇద్దరు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఎల్వీఎన్ పురానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లుకి అదే ప్రాంతానికి చెందిన దుర్గతో వివాహం జరిగింది.
కాగా, పెళ్లికి ముందే దుర్గ నాగేందర్ అనే వ్యక్తిని ప్రేమించినట్టుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది దుర్గ. అయితే ముందునుంచి భర్త అంటే ఇష్టం లేని దుర్గ, ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడు నాగేందర్ తో చెప్పి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసింది.
ముందుగా వేసిన పథకం ప్రకారం.. ప్రియుడు నాగేందర్ ను భర్త వెంకటేశ్వర్లుకు పరిచయం చేసింది దుర్గ. ఇదే క్రమంలో జూన్ 11వ తేదీన వెంకటేశ్వర్లును ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి పీకల దాకా తాగించాడు నాగేందర్. అనంతరం మద్యం మత్తులో ఉన్న అతన్ని భార్య దుర్గ, ప్రియుడు నాగేందర్ కలిసి హత్య చేసి సమీపంలోని ఓ కాలువలో పడేశారు.
అనుమానస్పద మృతిగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిజాన్ని రాబట్టగలిగారు. విచారణలో భాగంగా హత్య చేసింది మృతుడి భార్యే అని తేలడంతో అసలు విషయం బయటపడింది.