ఏపీలో రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం ? ప్రధానికి జగన్ చెప్పబోయేది ఇదే !
ఏపీలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా ? లేదా ? అన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రధానితో పాటు కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయగా.. ఇవాళ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ప్రధాని మోడీకి ఇదే విషయాన్ని మరోసారి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుందా ?
ఏపీలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితితో పాటు ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ కొనసాగింపుపై ఓ క్లారిటీతోనే ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ శాఖలకూ ఈ మేరకు సంకేతాలు వెళ్లాయి.

రెడ్ జోన్లలోనే కొనసాగింపు..
ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా తేల్చారు. వీటికి సమీపంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలను బఫర్ జోన్లుగా ఉంచారు. ఏప్రిల్ 14 తర్వాత ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తే చాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. దీంతో ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పేయగా.. ఇవాళ సీఎం జగన్ మరోసారి ఇదే విషయాన్ని ఆయనకు వివరించనున్నారు.

లాక్ డౌన్ తొలగించే ప్రాంతాల్లో...
ఏపీలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ తొలగించ బోయే ప్రాంతాలపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినందున వాటిలో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు. పరిశ్రమల శాఖ తరఫున అధికారులు ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే ఏయే పరిశ్రమలు తెరవాలి, వాటిలో జనాన్ని ఏయే షిఫ్టుల్లో అనుమతించాలి వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది. రెండు రోజుల్లో దీనిపై ఓ స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించనుంది.

ప్రభుత్వ పాలనపై ప్రభావం...
లాక్ డౌన్ పరిమితంగానైనా ఎత్తేయాల్సిన పరిస్ధితులు వస్తే ఆయా జిల్లాల నుంచి రాజధానికి జనం రాకపోకలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంత్రుల, అధికారుల రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ఇఫ్పడు తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజధాని ప్రాంతాల్లో రెడ్ జోన్లు తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాకపోకల కోసం కొన్ని మార్గాలనే తెరిచే అవకాశం ఉంది. వీటిలోనూ రాకపోకలను పరిమితం చేయనున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాలన కుంటుపడకుండా చేయడం ద్వారా తిరిగి రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications