వేసవి సెలవులు ఇవ్వకపోతే...కాలేజ్ ల గుర్తింపు రద్దు:మంత్రి గంటా
విజయవాడ : కళాశాలలకు వేసవిలో సెలవలివ్వకపోతే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రత్యేకించి ఈ సమస్య ఎదురయ్యే కార్పొరేట్ కళాశాల విషయంలో ఈ విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు.
కార్పొరేట్ కాలేజ్ లలో క్లాస్ల నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి గంటా వేసవి సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహించే ఏ కాలేజ్ లపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇందుకోసమే ప్రత్యేకంగా కొన్ని టీం లను రెడీ చేసి కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పట్టుబడితే ఆయా కాలేజ్ లకు భారీ జరిమానాలు విధించడమే కాదు, అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
మరోవైపు విద్యార్థుల్లో క్రియేటివిటీ అభివృద్ది పరిచేందుకు ఈ నెల 25 నుంచి జూన్ 7 వరకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పౌర గ్రంథాలయ శాఖల ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఈ స్పెషల్ క్యాంప్ ల నిర్వహణ జరుగుతుందని మంత్రి గంటా వివరించారు. ఈ సమ్మర్ క్యాంపుల్లో బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్, రివ్యూస్ రైటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, ధియేటర్ ఆర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తారని మంత్రి గంటా వెల్లడించారు.