చంద్రబాబుకు మళ్లీ ఆ పాత మిత్రులు కలిసొస్తారా ? జగన్ భయంతో హ్యండిస్తారా ! సర్వత్రా ఆసక్తి !
ఏపీలో రాజకీయాల్ని కీలక మలుపు తిప్పిన చరిత్ర 2019 ఎన్నికలది. అప్పటివరకూ ఏ ఎన్నికలు వచ్చినా అప్పటి రాజకీయం అప్పటివరకే ఉండేది. ఆ తర్వాత ఎవరి వ్యాపారావు వారివి. ఎవరి రాజకీయాలు వారివి అన్నట్లే పరిస్ధితి ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయ పార్టీల అధినేతలే కాదు, వారికి అండగా నిలుస్తున్నవారి పరిస్ధితుల్నికూడా తలకిందులు చేసేశాయి. ఇలా తనకు గతంలో అండగా నిలిచిన వారి సాయం మరోసాైరి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి అందబోతోందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
2019 ఎన్నికల రాజకీయం
2019లో ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగిన పోరు రాజకీయాల్లో కనీస అవగాహన కలిగిన వారెవరరూ మర్చిపోలేదు. ముఖ్యంగా ఆ ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ వేసిన ఎత్తుగడలు, వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు చంద్రబాబు చేసిన వ్యూహరచన ఎవరూ మర్చిపోలేదు. ఈ క్రమంలో చాలా లెక్కలు తారుమారైపోయాయి. ముుఖ్యంగా ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా ఓ ముగ్గురు మిత్రులు రంగంలోకి దిగారు. అందులో ఒకరు ఎప్పుడో రాజకీయాలు వదిలేసిన మాజీ ఎంపీ కాగా... మరొకరు చంద్రబాబు హయాంలో నిఘాధిపతిగా పనిచేసిన వ్యక్తి, మూడో వ్యక్తి ఓ పత్రికాధినేత. ఈ ముగ్గురు సొంత మనుషుల్లా మారిపోయి సాయంచేసినా చంద్రబాబు వ్యూహం తలకిందులైంది.
పాతమిత్రుల కోసం చంద్రబాబు ?
గతంలో టీడీపీ తరఫున ఎన్నికల రాజకీయం నడిపించడంలో ఈ త్రయం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా టికెట్ల ఎంపిక, ఆశావహుల బుజ్జగింపులు, డబ్బుల పంపిణీ వంటి అంశాల్ని ఈ త్రయమే చూసుకుందనే ప్రచారం ఉంది. అలాగే దశాబ్దానికి పైగా చంద్రబాబుకు ఆర్దికంగా అండగా నిలుస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా కీలకంగా ఉన్నారు. వీరంతా తిరిగి తనకు అండగా నిలుస్తారనే భావనలో చంద్రబాబు కనిపిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా వీరు సహకరిస్తే చాలు తనకు ఢోకా ఉండబోదనే ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ విరి పరిస్ధితి మాత్రం అలా లేదు.
వెంటాడుతున్న జగన్ భయం ?
గతంలోలా చంద్రబాబుకు ఎన్నికల్లో వ్యూహరచన చేసిన త్రయం కానీ, అలాగే ఆర్ధికంగా అండగా నిలిచిన వారు కానీ ఈసారి మాత్రం జగన్ భయంతో బెంబేలెత్తుతున్నారు. వీరిలో మాజీ ఎంపీ అయితే హైదరాబాద్, ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. మాజీ నిఘాధిపతి అయితే వరుస సస్పెన్షన్లతో ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగేని సర్వీసు వదులుకుని ఇప్పటికిప్పుడు రాజకీయం చేసే పరిస్ధితి కనిపించడం లేదు. మరోవైపు పత్రికాధిపతి మాత్రం మిగతా వారి కంటే కాస్తో కూస్తో నయంగా కనిపిస్తున్నారు. అయినా ఫోన్ ట్యాపింగ్ భయంతో నేరుగా రంగంలోకి దిగే పరిస్దితి లేదు. మరోవైపు చంద్రబాబుకు గతంలో ఆర్ధికంగా అండగా ఉన్న వారు కూడా జగన్ భయంతో మొహం చాటేస్తున్నారు. వీరు ఎన్నికల నాటికి ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.
అసలు గేమ్ ఛేంజర్ అదే ?
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్దితుల్లో పాతమిత్రుల అండ కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు జగన్ భయంతో వారు ముందుకొస్తారా రారా అన్న సందేహాలు తప్పడం లేదు. అయితే ఇదంతా సాధ్యం కావాలంటే మాత్రం చంద్రబాబుకు బీజేపీ అండ దొరకాల్సిందే. అప్పుడు మాత్రమే వీరంతా జగన్ భయాన్ని తట్టుకుని చంద్రబాబు వైపు మొగ్గే అవకాశముంది. అందుకోసమే ఎట్టిపరిస్దితుల్లోనూ బీజేపీ మద్దతు సంపాదించాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ అండ దొరికితే మాత్రం వీరంతా దారిలోకి రావడంతో పాటు జగన్ పై మానసికంగా కూడా పైచేయి సాధించేందుకు చంద్రబాబుకు వీలవుతుంది.