చంద్రబాబుకు అంతుబట్టని ఆ 35 ? వైసీపీకి ముందస్తు ప్రయోజనం ! 2019 సీన్ రిపీట్ ?
ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఓ అంశం కీలక పాత్ర పోషించింది. ఎన్నికల వరకూ దీని గురించి ఆలోచించని ఇతర పార్టీలు సైతం ఈ విషయంలో జగన్ ను ఫాలో కాకపోవడం తమ తప్పిదమేనని ఏదో ఒక సందర్భంలో అంగీకరించాయి. అయితే మళ్లీ అదే విషయంలో అవే పార్టీలు వెనుకబడిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఇందులో చాలా వెనుకబడి ఉంది. 2024లో గెలవక తప్పని పోరు కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతల్ని సిద్ధం చేస్తున్న చంద్రబాబు ఆ విషయంలో మాత్రం ఎందుకో నిర్లిప్తంగా ఉండిపోతున్నారు.

ఏపీలో ఎన్నికల అస్త్రాలు
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ సీరియస్ గా సిద్ధమవుతున్నాయి. ఇందులో వైసీపీ ఓ విషయంలో అందరి కన్నా ముందే కనిపిస్తోంది. సరిగ్గా 2019 ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్దితి. అప్పట్లో వైసీపీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయాల్ని తప్పుబట్టిన మిగతా పార్టీలు.. ఎన్నికల ఫలితాలు చూసి మాత్రం నివ్వెరపోయాయి. జగన్ అప్పట్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై మల్లగుల్లాలు పడ్డాయి. చివరకు విశ్లేషిస్తే అదే కరెక్ట్ అని తేల్చుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి జగన్ ను ఫాలో అయ్యేందుకు మిగతా పార్టీలు ఎందుకో కానీ ఇష్టపడటం లేదు. ఇది అంతిమంగా వైసీపీకే లబ్ది చేకూర్చేలా కనిపిస్తోంది.

అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లు
ఎన్నికల కంటే ముందే ప్రతీ పార్టీ కూడా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ఓ క్లారిటీతో ఉంటుంది. చివరి నిమిషంలో చేసే ఒకటీ అరా మార్పుల్ని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఈ క్లారిటీ ఉంటుంది.దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ పార్టీ ఇన్ ఛార్జ్ లను నియమిస్తుంటుంది. ఇలా నియమించడం ద్వారా పార్టీకి ఓ క్లారిటీ ఉంటుంది. అలాగే సదరు ఇన్ ఛార్జ్ లకు కూడా ముందుగానే టికెట్ ఖాయమనే భావనతో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు, డబ్బులు ఖర్చుపెట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది అంతిమంగా ఎన్నికల్లో ఆయా ఇన్ ఛార్జ్ లకు లబ్ది చేకూరుస్తుంది. అలాగే పార్టీ విజయావకాశాల్నిసైతం పెంచుతుంది. ఇక్కడ వెనుకబడితే మాత్రం ఎన్నికలకు ముందే పార్టీలు చేతులెత్తేసినట్లు అనుకోవాల్సి ఉంటుంది.

టీడీపీకి 35 చోట్ల ఇన్ ఛార్జ్ ల కరవు ?
2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీని ఎదిరించి నియోజకవర్గాల్లో పోటా పోటీ రాజకీయాలు చేసే విపక్ష నాయకులు కరువయ్యారు. ఈ ప్రభావం ప్రధాన విపక్షమైన టీడీపీపై బాగానే పడింది. దీంతో పలు చోట్ల టీడీపీ తరఫున ఇన్ ఛార్జ్ లుగా పనిచేసేందుకు నేతలు కరువయ్యారు. పార్టీలో గతంలో మంత్రి పదవుల్లో పనిచేసిన నేతలు, సీనియర్లు కూడా ఇన్ ఛార్జ్ పదవులు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఇప్పుడే ఇన్ ఛార్జ్ పదవులు తీసుకుంటే డబ్బుల ఖర్చు, అధికార పార్టీ కేసులు, దాడులతో టార్గెట్ చేసే అవకాశం ఉంటుందన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో 35 నియోజకవర్గాల్లో ఇలా టీడీపీకి ఇన్ ఛార్జ్ లు లేకుండా పోయారు. దీంతో చంద్రబాబు కూడా ఆయా చోట్ల ఇన్ ఛార్జ్ ల నియామకం విషయంలో ఏమీ చేయలేని పరిస్దితి.
ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేసి మరీ చంద్రబాబుకు గుర్తుచేశారు.

2019 సీన్ రిపీట్ అవుతుందా ?
2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధుల్ని వైఎస్ జగన్ చాలా ముందుగానే ప్రకటించారు. వారిలోనూ దాదాపుగా ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారికే టికెట్లు కేటాయించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే వైసీపీ ఇన్ ఛార్జ్ లు సిద్దంగా ఉన్నారు. వారిలో ఎక్కడో ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా అందరికీ టికెట్లు ఇచ్చేశారు. దీంతో వారంతా ఎలాంటి సందిగ్ధం లేకుండా పనిచేసుకున్నారు. ఎన్నికలకు పూర్తిస్దాయిలో సన్నద్దమయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎన్నికలకు కేవలం 15 నెలల సమయం ఉన్నా 35 స్ధానాల్లో ఇన్ ఛార్జ్ లను నియమించుకోలేని పరిస్దితుల్లో ఉంది. ఆయా చోట్ల వైసీపీ అభ్యర్దులు చాలా బలంగా ఉన్నారు. పలుచోట్ల మంత్రులు కూడా ఉన్నారు. వీరిని తట్టుకుని 2024లో గెలుపు గుర్రాల్ని ఎంపిక చేసుకోలేకపోవడం టీడీపీకి నష్టం చేస్తుండగా..వైసీపీ ఆమేరకు ప్రయోజనం పొందుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఈ 35 సీట్లు అప్పనంగా వైసీపీకి అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications