మళ్లీ జగన్ వైపు కొణతాల, బొత్స రాకపై బుజ్జగింపు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విశాఖ జిల్లా సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తిరిగి జగన్ వైపు రానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కొణతాలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టుగా తెలుస్తోంది.
గత కొంతకాలం కిందటి వరకూ కొణతాల వైకాపా సెంట్రల్ కమిటీలో రాజకీయ వ్యవహారాలను చూసేవారు. జగన్తో విబేధించి ఆయన బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కానీ కొణతాల తిరిగి వైసీపీలోకి వెళతారన్న వార్తలు వెలువడుతున్నాయి.

మరోవైపు, వైసీపీ అధిష్ఠానం విజయనగరం జిల్లా పార్టీ నాయకులతో ఆదివారం భేటీ అయింది. పార్టీలోకి బొత్స సత్యనారాయణ రాకను బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సాంబశివరాజు, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు వ్యతిరేకిస్తున్నారు.
వీరిని బుజ్జగించేందుకు అధిష్ఠానం ఆదివారం హైదరాబాద్ పిలిపించి చర్చలు జరిపింది. బొత్స కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులు సాంబశివరాజు, కోలగట్ల వీరభద్రస్వామి తదితరులను కలిసి, బొత్స రాకకు అడ్డు చెప్పవద్దని కోరారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications