ఏపీకి మోడీ భారీ ప్యాకేజీ, వరాలు?: పక్క రాష్ట్రాలతో ఐటీ పోటీ, బాబు ప్లాన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ పైన కేంద్రం కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో కేంద్రం రోడ్ మ్యాప్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు భారీగా వరాలు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పైన రోడ్ మ్యాప్ తయారు చేయాలని నీతి అయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియాను ప్రధాని కార్యాలయం ఆదేశించింది. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రత్యేక ప్యాకేజీ పైన కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
అదే సమయంలో 22న మోడీ వచ్చి ఏపీకి కేంద్రం ఏం ఇచ్చింది, ఏం ఇవ్వనుంది అనే అంశాలపై చెప్పనున్నారు. ఏపీకి ప్రధాని మోడీ వరాలు ఇస్తారని బిజెపి నేతలు భావిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదా పైన మాత్రం కేంద్రం బీహార్ ఎన్నికల తర్వాతనే నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు.

మరోవైపు, ఏపీలో ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. పొరుగు రాష్ట్రాలతో పోటీని తట్టుకునేలా, ఏపీలో తక్కువ నిర్వహణ ఖర్చుతో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేలా ఈ రాయితీలున్నట్లు తెలిపింది.
ప్రైవేటు వ్యక్తులు, అభివృద్ధిదారులు ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యాలయాల (ప్లగ్ అండ్ ప్లే) సేవలు కల్పిస్తే వారికి మూడేళ్ల పాటు రాయితీలతో పాటు ఈ భవనాలు, స్థలాల్ని డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కులు (డీటీపీ)గా గుర్తిస్తామని పేర్కొంది.
ఈ మేరకు ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఫణికిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు అనువైన వాతావరణాన్ని ఇక్కడి ప్రభుత్వం కల్పించనుంది.
ఐటీ కంపెనీలు ఏపీలో కొత్తగా సృష్టించే ఉద్యోగాల్లో ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్ఠంగా రూ.2వేల చొప్పున రెండేళ్లపాటు భవిష్యనిధి సొమ్మును తిరిగి చెల్లించనుంది. అయితే ఆ ఉద్యోగికి ఆ సంస్థలో ఖచ్చితంగా రెండేళ్ల సర్వీసు ఉండాల్సిందే. మరో ఏడాదిలో సౌకర్యాలయాలు ఏర్పాటు చేసే సంస్థలు డీటీపీలుగా గుర్తించేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications