కరోనా తర్వాత జనంపై పన్నుల మోత తప్పదా ? ఇప్పటికే ప్రభుత్వాల సంకేతాలు...
కరోనా సంక్షోభం తీసుకొచ్చిన పరిస్ధితులు ఆర్ధిక వ్యవస్దలను కుదేలు చేస్తున్న వేళ.. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతోంది. ప్రభుత్వాలు ముందుకు సాగాలంటే కీలకమైన ఆదాయ వనరులు మూసుకుపోతుండటంతో ఇప్పుడు వాటికి ఊపిరాడటం లేదు. చివరికి ఎంత వద్దనుకున్నా జనంపై పన్నులు, ధరల మోత విధించక తప్పని పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇదే కోవలో ఏపీ సర్కారు మద్యం వినియోగాన్ని నియంత్రించే పేరుతో ఏకంగా 25 శాతం రేట్లను పెంచింది. భవిష్యత్తులో మరిన్ని ఆదాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది.
Recommended Video

ఏపీలో పన్నుల మోత తప్పదా ?
కరోనా సంక్షోభంతో అన్ని ప్రభుత్వాలకు ఆర్ధిక సంక్షోభం తప్పడం లేదు. అయితే అసలే విభజన కష్టాలతో చిల్లి గవ్వలేని పరిస్ధితుల్లో గంపెడు సంక్షేమ పథకాలతో అతి కష్టం మీద ముందుకు సాగుతున్న ఏపీ సర్కారుకు కరోనా విపత్తు మూలిగే నక్క మీద తాటిపండులా పడింది. దీంతో అటు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వలేక, ఇటు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతోంది. దీంతో ఇక చివరి అస్త్రమైన పన్నుల పెంపునే ఆశ్రయించక తప్పలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకోకముందే మద్యం అమ్మకాలను నిరుత్సాహపరుస్తామనే సాకుతో ఏకంగా 25 శాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో మిగతా శాఖల్లోనూ పన్నుల మోత తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లయింది.

అడుగంటిన ఆదాయం.. భవిష్యత్తుపై చీకట్లు...
ఏపీలో ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా నెలకు 1500 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. రాష్ట్రానికి లభించే అతి పెద్ద ఆదాయ వనరు ఇదే. ఆ తర్వాత మైనింగ్, భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుంది. కానీ నెలన్నర రోజులుగా వీటిలో ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది. జీఎస్టీలో రాష్ట్రం వాటా కింద నెలకు 500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. మిగతా శాఖల నుంచి ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. తాజాగా మద్యం ధరల పెంపుతో కనీసం 500 కోట్లయినా వెనకేసుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. మిగతా రంగాలు కోలుకోకపోతే రాబోయే రెండు, మూడు నెలల్లో పరిస్ధితులు మరింత దారుణంగా మారే ప్రమాదముంది. అందుకే ముందు జాగ్రత్తగా అవకాశమున్న మద్యం ధరలను పెంచేశారు.

మరిన్ని ఆదాయ మార్గాలపై ఆరా...
తాజాగా ప్రభుత్వంలో సీఎం జగన్ పలు మార్పులు చేశారు. ఆదాయార్జన శాఖలను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవకు కట్టబెట్టారు. ఆదాయార్జనకు ఉన్న అవకాశాలపై ఆయన ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. వీటిలో భాగంగానే మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. ఇదే కోవలో భూముల రిజిస్ట్రేషన్లు, మైనింగ్ ఆదాయంపైనా ఇప్పుడు ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే భూముల రిజిస్ట్రేషన్లు, మైనింగ్ తవ్వకాల రేట్లూ పెరగబోతున్నాయి. ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొత్తగా ఆదాయం లభించే మార్గాలపైనా ఇప్పుడు రజత్ భార్గవ దృష్టిసారిస్తున్నారు.

గత్యంతరం లేని పరిస్ధితి...
ప్రస్తుత పరిస్ధితుల్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఉన్న ప్రతీ ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం కచ్చితంగా వినియోగించుకోవాల్సిన పరిస్ధితి. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉండిపోయిన మధ్యతరగతి ప్రజలకు ఖర్చులు చాలా వరకూ తగ్గిపోయాయి. నిలకడగా ఆదాయం ఆర్జించే పరిస్ధితి ఉంటే మాత్రం ఖర్చులేకపోవడం సానుకూల సంకేతమే. దీంతో మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకుని పన్నులు, ధరల పెంపు ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల అప్పులతో ఉన్న ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు పెను భారంగా మారిపోయాయి. కానీ మ్యానిఫెస్టో అమల్లో భాగంగా వీటిని అమలు చేయక తప్పని పరిస్ధితి. దీంతో జగన్ కూడా వీటి అమలు కొనసాగిస్తూనే కొత్తగా ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టాలని అధికారులను పదేపదే కోరుతున్నారు. తాజాగా రజత్ భార్గవు బాధ్యతలు అప్పగించడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. దీంతో త్వరలో భారీగా పన్నుల వడ్డన తప్పదని తెలుస్తోంది. అయితే ఏయే పన్నులు పెరగబోతున్నాయో ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications