మోడీ వైజాగ్ టూర్ హైజాక్ చేస్తున్న వైసీపీ ? భీమవరం ప్లాన్ రిపీట్ ! పవన్ సహా అంతా దూరం ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న జనసేనకు మిత్రపక్షంగా ఉంది. అయినా బీజేపీ మిత్రపక్షం జనసేనతో పాటు మిగతా విపక్షాలన్నింటినీ వైసీపీ ఒకేలా చూస్తోంది. అంతే కాదు ప్రధాని మోడీ ఏపీలో పర్యటనలకు వచ్చినప్పుడు విపక్షాలన్నింటినీ దూరం పెడుతోంది. త్వరలో వైజాగ్ లో జరిగే ప్రధాని మోడీ టూర్ లో ఈ ఫీట్ మరోసారి రిపీట్ చేయబోతోంది.

వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో విపక్షాలను పూర్తిగా టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్.. వారిని ఏమాత్రం ఊపిరాడనీయకుండా చేస్తోంది. ఇందుకోసం దాడులు, కేసులు, అరెస్టుల్ని వాడుకుంటోంది. అదే సమయంలో విపక్షాలు కూడా వైసీపీ సర్కార్ చేసే ప్రతీ పనీ, తీసుకునే ప్రతీ నిర్ణయం తప్పనే విధంగా రెచ్చిపోతున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ వేటినీ లెక్కచేయకుండా ముందుకెళ్లిపోతున్నారు. చివరికి విపక్షాలను ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ భాగస్వాముల్ని చేసేందుకు ఇష్టపడటం లేదు. అదీ విపక్షాలకు కంటగింపుగా మారుతోంది.

ప్రధాని మోడీ వైజాగ్ టూర్
ప్రధాని మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించబోతున్నారు. ఏడు కీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపనలు చేసేందుకు ఆయన విశాఖ వస్తున్నారు. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా పనులకు ఈ టూర్ లో ప్రధాని మోడీ శంఖుస్ధాపనలు చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ప్రధాని టూర్ ను పూర్తి అధికారిక కార్యక్రమంగానే నిర్వహిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంటే ఇందులో రాజకీయపార్టీలకు, నేతలకు చోటివ్వడం లేదని ఆయన ముందుగానే తేల్చిచెప్పేశారు.

గతంలో భీమవరం టూర్ లోనూ
గతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోడీ భీమవరం వచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగింది. అధికారిక కార్యక్రమమైనా అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం వైసీపీ నేతలు మినహా మరో పార్టీ నేత కనిపించలేదు. ఆహ్వానం తీసుకుని అక్కడికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కూడా రానివ్వలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అయితే దూరంగానే ఉండిపోయారు. దీంతో మోడీ భీమవరం టూర్ కాస్తా వైసీపీ-బీజేపీ కార్యక్రమంగానే సాగిపోయింది.

మోడీ టూర్లను వైసీపీ హైజాక్ చేస్తోందా ?
ప్రధాని మోడీ టూర్లలో విపక్షాల నేతలు పాల్గొనకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై ఆయా పార్టీలు మండిపడుతున్నాయి. ఇవేవీ వైసీపీ సొంత కార్యక్రమాలు కావని, దేశ ప్రధాని ఏపీకి వస్తుంటే తాము పాల్గొనకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా ప్రశ్నించారు. వైసీపీ వైఖరిని ముందే గ్రహించి పరువు కాపాడుకునేందుకు టీడీపీ, జనసేన వంటి పార్టీలు దూరంగానే ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఈసారి మోడీ టూర్ కూడా కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమంగానే జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications