రుయా ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్-6 గురు అంబులెన్స్ డ్రైవర్ల అరెస్ట్-విపక్షాల ఫైర్
ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని స్వస్ధలానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డబ్పులు డిమాండ్ చేయడంతో తండ్రి బైక్ మీదే 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో డ్రైవర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఆరోగ్యసేవల రంగం నిర్వహణ తీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని విపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది.
రుయా ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్-6 గురు అంబులెన్స్ డ్రైవర్ల అరెస్ట్-విపక్షాల ఫైర్#andhrapradesh,#tirupati pic.twitter.com/YZC95cRMHx
— oneindiatelugu (@oneindiatelugu) April 26, 2022
రుయా ఆస్పత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు ఆస్పత్రి వద్ద రాజకీయ పార్టీలు నిరసనకు దిగడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్లు భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఈసారి మాత్రం ఇది అందరి కంట పడటంతో రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్ పై తరలించిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్ పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు ఆరోపించారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్ లో దుస్థితిని అద్దం పడుతుందని చంద్రబాబు తెలిపారు. బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్ పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు తన ట్వీట్ కు జత చేశారు.