సుప్రీం షాకులు-జగన్ కేసులపై మరింత ఒత్తిడి- ఛార్జిషీట్ల దాఖలు పూర్తయితే వారికి చుక్కలే
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారాన్ని ఏడాది లోపు తేల్చాలని పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు.. ఇందులో తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటిలో హైకోర్టులతో పాటు దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రభావం ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సీబీఐ, ఈడీ కేసులపై కచ్చితంగా పడబోతోంది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆయా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జిషీట్లు వేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతుండగా.. విచారణలు వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుపైనా ఒత్తిడి పెరుగుతోంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇప్పటికే నమోదైన పలు క్రిమినల్ కేసుల్లో విచారణ నత్తనడకన సాగుతోంది. దీంతో వీరంతా ఎంచక్కా ప్రతీ ఎన్నికల్లో పోటీ చేయడం, అక్రమాలకు పాల్పడటం, తిరిగి ఎన్నికవడం చాలా సునాయాసంగా జరిగిపోతోంది. దీంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్ధ బలోపేతం కావాలంటే నేరచరిత్ర కల నేతలను దూరంగా ఉంచాలని భావిస్తున్న సుప్రీంకోర్టు.. వీరికి వ్యతిరేకంగా దాఖలైన కేసుల్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.

సుప్రీంకోర్టు వరుస షాకులు
దేశవ్యాప్తంగా క్రిమినల్ నేర చరిత్ర కలిగిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తు సంస్ధలు తమ దర్యాప్తులు పూర్తి చేయకుండా తాము విచారణ ఎలా పూర్తి చేయాలంటూ హైకోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు సంస్ధలకూ సుప్రీం షాకిచ్చింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలు ఏళ్ల తరబడి కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా కాలయాపన చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా ఆయా కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో దర్యాప్తు సంస్ధలు కొరడా ఝళిపించేందుకు సిద్దమవుతున్నాయి.

జగన్ ఆక్రమాస్తుల కేసులు
పదేళ్ల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుల్ని తేల్చడంలో సీబీఐ దారుణంగా విఫలమైంది. దేశ, విదేశాలతో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సంబంధం ఉన్న ఈ కేసుల్లో దర్యాప్తును పదేళ్లుగా చేస్తున్నా ఇంకా ఓ కొలిక్కి తీసుకురావడంలో సీబీఐ విఫలమైంది. కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారు చెప్పినట్లుగా దర్యాప్తు స్పీడు పెంచడం, తగ్గించడంతో ఈ కీలకమైన కేసుల వ్యవహారం ఇప్పటికీ తేలడం లేదు. దీంతో దాదాపు 38 సీబీఐ, ఈడీ కేసులున్న సీఎం జగన్ ఎంచక్కా సీఎం కూడా అయిపోయారు. ఈ కేసులు ఎప్పటికి తేలతాయో ఎవరికీ తెలియదు. దీంతో కేసులతో సంబంధం లేకుండా జగన్ తన పాలనలో బిజీగా కనిపిస్తున్నారు.

జగన్ కేసుల్లో ఇక వేగంగా విచారణ
కానీ తాజాగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ న్యాయస్ధానాలు విచారణను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ, ఈడీ దాఖలైన కేసుల్ని తేల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 15న దాన్నీ తేల్చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో పాటు సీబీఐ, ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు, నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లు, మినహాయింపులు ఇలా ప్రతీ పిటిషన్ పైనా విచారణ వేగవంతం కాబోతోంది. ఇది అంతిమంగా నిందితులకు సంకటంగా మారబోతోంది.

జోరు పెంచబోతున్న సీబీఐ, ఈడీ
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ ఇప్పటికే పలు కేసులు నమోదు చేశాయి. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ ఛార్జిషీట్లు నమోదు చేసింది. వీటిపై ఏకకాలంలో విచారణ కావాలని, లేదంటే ముందుగా సీబీఐ విచారణ కావాలని జగన్ ఆస్తుల కేసులో నిందితులు కోరినా సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా ఈడీ కేసుల్నే ముందుగా తేల్చాలని నిర్ణయించాయి. దీంతో ఈడీ ఛార్జిషీట్లపై త్వరలో విచారణ ప్రారంభం కాబోతోంది. అదే సమయంలో సీబీఐ, ఈడీ ఇంకా దాఖలు చేయని ఛార్జిషీట్లపైనా ఒత్తిడి పెరగబోతోంది. విదేశాలతో లింక్ ఉన్న కేసుల పేరుతో ఇంకా మరికొన్ని ఛార్జిషీట్లు దాఖలు చేయని సీబీఐ, ఈడీ ఇప్పుడు వాటి విషయంలోనూ ఏదో ఒకటి తేల్చేందుకు సిద్దమవుతున్నాయి.
Recommended Video

ఛార్జిషీట్లు పూర్తయితే ఇక చుక్కలే
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్ల దాఖలు పూర్తయితే ఇక ఈ కేసుల్ని సీబీఐ కోర్టు సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు వీలు కలుగుతుంది. సుప్రీంకోర్టుకు తాజాగా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా చేసిన సిఫార్సుల ప్రకారం ఛార్జిషీట్లు దాఖలైన కేసుల్లో విచారణ రోజువారీగా చేపట్టడంతో పాటు దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు, స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. అదే జరిగితే జగన్ ఆస్తుల కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ చేపట్టేందుకు వీలు కలుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం ఏడాది లోపు ఈ కేసుల్లో తీర్పులు కూడా వెలువడటం ప్రారంభం అవుతుంది. అప్పుడు వాటిని హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు నిందితులకు కూడా అవకాశం దొరుకుతుంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications