ఫొటో: హైదరాబాదులో 'నిర్భయ', రేప్ చేసి హత్య
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో నిర్భయ తరహా ఘటన జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసి ఆపై దారుణంగా కత్తులతో పొడిచి ఔటర్ రింగ్రోడ్పై పడేసి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
సంచలనం రేపిన ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతిని హిమాయత్సాగర్ ఔటర్ రింగ్రోడ్డు వైపునకు తీసుకొచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయిందని భావించిన దుండగులు యువతిని అవుటర్ రింగ్రోడ్ బ్రిడ్జిపై కారులోంచి పడేసి పరారయ్యారు.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించగా, తన పేరు లలిత అలియాస్ శిరీష అని, తమది మహబూబ్నగర్ జిల్లా అని, ఏడుగురు బలవంతంగా కారులో తీసుకొచ్చి అత్యాచారం చేశారని, కత్తులతో పొడిచి రోడ్డుపై పడేసి వెళ్ళారని చెప్పి మృతిచెందింది.
యువతి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఉస్మానియాలో భద్రపరిచామని, కుటుంబీకులు వస్తే అప్పగిస్తామని సిఐ కుశాల్కర్ తెలిపారు.












Click it and Unblock the Notifications