గుంటూరు జిల్లాలో మహిళా సర్పంచ్ ఆత్మహత్య!...కలకలం...
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ సర్పంచ్ లక్ష్మీదుర్గ తమ ఇంట్లో ఉరివేసుకున్నారు. అయితే మహిళా సర్పంచ్ లక్ష్మీదుర్గ ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రజలందరూ పండగ సందడిలో ఉండగా నారాకోడూరులో మాత్రం విషాద ఘటన చోటుచేసుకొంది. గ్రామ సర్పంచ్ జాలాది లక్ష్మీదుర్గ ఆత్మహత్యకు పాల్పడ్డం స్థానికంగా అందర్నీ కలచివేసింది. సర్పంచ్ లక్ష్మీ దుర్గ ఆత్మహత్యపై స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీదుర్గకు జాలాది భానుప్రసాద్లో 11 ఏళ్ల కిందట కులాంతర వివామైంది. వీరికి పదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. భానుప్రసాద్ వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటుండటంతో అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి పిల్లలిద్దరూ హైదరాబాద్ లోనే చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్ష్మీదుర్గ నారాకోడూరుకు వచ్చినట్లు తెలసింది.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన ఇంట్లోని మొదటి అంతస్తులోని బెడ్ రూమ్ నుండి ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో చివరికి వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లిచూశారు. అయితే అప్పటికే లక్ష్మీదుర్గ శరీరం ఫ్యానుకు వేళ్లాడుతూ హడావుడిగా వెళ్లి చూశారు. అయితే అప్పటికే చనిపోయినట్లు తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వ్యాపారంలో నష్టాలు, ఆస్తులు అమ్ముకోవాల్సి రావడం, కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలివిడిగా , నలుగురికి సాయం చెయ్యాలనే స్వభావంతో ఉండే లక్ష్మీదుర్గ ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీదుర్గ భౌతికకాయాన్ని స్థానిక ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ సందర్శించి నివాళులర్పించారు.