బిడ్డను రూ. 70 వేలకు విక్రయం: ఆపై కనిపించడం లేదని ఫిర్యాదు
కాకినాడ: ఓ మహిళ ఐదు నెలల వయస్సున్న తన కన్న బిడ్డను రూ.70వేలకు విక్రయించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో చోటుచేసుకుంది. అయితే తన బిడ్డ కనిపించడంలేదంటూ తిరిగి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కాకినాడ వన్ టౌన్ ఎస్సై రవికుమార్ మీడియాకు వివరించారు.
కిర్లంపూడి మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన గనెమ్మ అనే ధనలక్ష్మి అయిదు నెలల వయస్సున్న తన పసి బిడ్డను ఈ నెల 25న కాకినాడ నగరం ఏటిమొగ ప్రాంతానికి చెందిన ఆకుల నూకరత్నం అనే మహిళకు విక్రయించింది. అయితే సోమవారం సాయంత్రం తన పసిబిడ్డ కనిపించడం లేదంటూ గనెమ్మ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది.
అయితే ఆమె పొంతనల్లేని సమాధానాలు చెప్పడంతో ఎస్సై రవికుమార్కు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆమె తన బిడ్డను విక్రయించినట్టు తెలియడంతో ఆ పసిబిడ్డను పోలీసులు స్వాధీనం చేసుకుని, సోమవారం రాత్రి ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు.
గనెమ్మ గతంలోను ఒక బిడ్డను విక్రయించినట్టు తమ దర్యాప్తులో తెలిసిందని, ప్రస్తుతం ఆ బాలుడు హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసిందన్నారు. ఆమెపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు.