భర్త అక్రమ సంబంధం.. భార్య ఆత్మహత్యకు దారితీసింది
కపిలేశ్వరపురం : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకొంది. తీరు మార్చుకోని భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో.. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన దుర్గ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దుర్గ, బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బొడ్డు నరేష్ కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక కొంతకాలానికే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న నరేష్ సంవత్సర కాలంగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
దీంతో దంపతులిద్దరి మధ్య తరుచూ ఈ విషయమై గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన దుర్గ మంగళవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, విషయం తెలుసుకుని బొబ్బిల్లంకకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెది ఆత్మహత్య కాదని అల్లుడు నరేషే హత్య చేసి ఉరి వేసుంటాడని ఆరోపించారు. అయితే నరేష్ తరుపు బంధువులు మాత్రం ఆరోపణలను కొట్టిపారేశారు. దుర్గ ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు.