లేడీస్కు 50 శాతం రిజర్వేషన్లని పద్మ, టీ కేబినెట్లో మహిళలేరని విపక్షాలు
హైదరాబాద్: మహిళా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... మహిళలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు, తెలంగాణలో విపక్షాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డాయి. మార్చి 8న మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలుచోట్ల మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. పలువురు నేతలు మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్నారు.
తెరాస కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళల భద్రతతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. రాబోయే కాలంలో చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కావాలని కోరుతూన్నామని తెలంగాణ శాసన సభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
హైదరాబాదులోని ఓ హోటల్లో జరిగిన మహిళా దినోత్సవ సదస్సులో ఎంపీ కవిత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు అందేలా కృషి చేస్తామన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ కేబినెట్లో మహిళా మంత్రి లేకపోవడం దారుణం: కిషన్ రెడ్డి
తెలంగాణ తొలి కేబినెట్లో మహిళా మంత్రి లేకపోవటం దారుణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారన్నారు.
కేబినెట్లో మహిళలు ఏరి?: టీడీపీ
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను తెలంగాణ టీడీపీ నేతలు సత్కరించారు. చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. దళితులు, మహిళలు లేని కేబినెట్ ఒక్క కేసీఆర్దేనని విమర్శించారు.
ఇందిరా గాంధీని గుర్తు చేసిన రఘువీరా రెడ్డి
మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఇందిరా గాంధీ అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు బాగుపడిన సందర్భాలు లేవన్నారు. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నమ్మించి మోసం చేసిందన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ఉద్యమంలా సాగాలన్నారు. డ్వాక్రా సంఘాలే దీనిని నడిపించాలన్నారు.