మండలిలో ఎలా కుదురుతుంది: కొన్ని పొరపాట్లు ఉండొచ్చు: కౌన్సిల్ లో యనమల కీ రోల్..!
ఏపీలో సంచలన నిర్ణయానికి కారణమైన శాసన మండలి ఛైర్మన్ నిర్ణయం వెనుక భారీ కసరత్తు జరిగింది. మండలిలో తమకున్న సంఖ్యా బలంతో ఎలాగైనా రాజధాని బిల్లులను ముందుకు పోకుండా అడ్డుకుం టామని టీడీపీ తొలి నుండి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. మండలిలో ఈ బాధ్యతలను పార్టీ పక్ష నేత..మండలిలో ప్రతిపక్ష నేత యనమలకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అసెంబ్లీ న్యాయ వ్యవహారాల పర్యవేక్షించిన నిపుణులతో మండలిలో ఎలా వ్యవహరించాలనే అంశం పైన యనమల చర్చించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొందిన ఉత్సాహంతో మండలిలో బిల్లుల ను ప్రవేశ పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి..తొలి నిమిషంలో యనమల షాక్ ఇచ్చారు. ఊహించని విధంగా రూల్ 71 మోషన్ ప్రతిపాదించి..తొలి రోజు సాయంత్రం వరకు మండలిలో ప్రభుత్వం బిల్లుల ను ప్రవేవ పెట్టే అవకాశం లేకుండా చేసారు. ఇక, బిల్లులపైన చర్చ ముగిసిన తరువాత సెలెక్ట్ కమిటీకి పంపే విధంగా సభలో ఒత్తిడి తీసుకురావటంలోనూ సక్సెస్ అయ్యారు.
ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండొచ్చు.. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు...
మండలిలో ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ సీనియర్ నేత యనమల కీలక వ్యాఖ్యలు చేసారు. మొత్తం వ్యవహారంలో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండొచ్చు.. కొన్ని పొరపాట్లు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కానీ, మండలిలో ఛైర్మన్ నిర్ణయమే ఫైనలని తేల్చి చెప్పారు. అసెంబ్లీలోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టే విషయంలో రూల్స్ పాటించలేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో స్పీకరుకు రూల్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలసీని మేం వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటీసిచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. పాలసీని వ్యతిరేకిస్తూ ఇచ్చిన రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై జరిగిన ఓటింగులో మేం గెలిచామని..నైతికంగా అప్పుడే ప్రభుత్వం ఓడిపోయిందన్నారు.

మండలిలో ఎలా కుదురుతుంది...
అసెంబ్లీలో ప్రభుత్వం బుల్ డోజ్ చేసుకుంటారేమో కానీ.. మండలిలో ఎలా కుదురుతుందంటూ యనమల వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను అప్రూవ్ చేసేసుకుని ఎలా వెళ్తారని నిలదీసారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికున్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తాము వ్యతిరేకించామని వివరించారు. ఛైర్మన్ పై దాడి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. పేపర్లు చించేశారు.. కొట్టడానికి వెళ్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంత్రి అనిల్ లోకేష్ పై దాడి చేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఇక, ప్రభుత్వం ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్తే అంతగా ఎందుకు ఇబ్బంది పడుతుందని ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications