'డిగ్రీ చదివితేనే'కు కౌంటర్: 'పవన్ వాగ్ధానాలు కుమ్మరిస్తున్నారు కానీ, నమ్మేదెవరు?'
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిని నమ్మవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అన్నారు. యువతకు న్యాయం చేయాలనే నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పారు. పవన్కు ఏ విషయం పైన అవగాహన లేదని, అనుభవం లేదని అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
బుర్జ్ ఖలీఫా నిర్మించిన సంస్థకు ఎలా ఇచ్చారు, ముందు మీ లెక్క చెప్పండి: బీజేపీకి కుటుంబరావు
వాగ్ధానాలు కుమ్మరిస్తున్నారు కానీ
నిరుద్యోగ భృతికి తాము ఎంతో కసరత్తు చేశామని యనమల అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని పవన్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనడం లేదన్నారు. తమకు అధికారం ఇస్తే అన్నీ చేస్తామని పవన్, జగన్ వాగ్ధానాలు కుమ్మరిస్తున్నారన్నారు.
ఏం అనుభవం ఉందని పవన్ను నమ్ముతారు
పవన్ కళ్యాణ్, జగన్లకు ఏం అనుభవం ఉందని ప్రజలు వారిని నమ్ముతారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలలో చాలా వాటిని అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 98 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని ఆయన అన్నారు.
యువత ఆకర్షితులవుతున్నందునే నిరుద్యోగ భృతి
అంతకుముందు రోజు, విజయనగరం జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యువత జనసేనకు ఆకర్షితులవుతున్నందు వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతిని నమ్మవద్దన్నారు.
అక్కడా మెలిక పెడతారు!
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని, డిగ్రీ చదవితేనే యువకులుగా పరిగణిస్తారంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇలాంటివి మోసం చేసే పథకాలు తప్ప నిజంగా యువతకు న్యాయం చేసే పథకాలు కావన్నారు. జనసేనను చూసి యువతను ఆకర్షించే ఇలాంటి పథకాలు పెడితే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జనసేన అధికారంలోకి వస్తే గిరిజనుల సమస్యను పరిష్కరిస్తామన్నారు.