జగన్! రూ.11కోట్లకు కక్కుర్తిపడి వైయస్ అలా చేశారు: మంత్రి యనమల సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి చంద్రబాబు, వైయస్లు ఎవరెవరు ఏమేం తెచ్చారో చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైయస్సార్ అయితే విదేశీ పర్యటనలకు వెళ్లి స్కాంలు చేసి వచ్చారని ఎద్దేవా చేశారు.
వైయస్ జర్మనీకి వెళ్లారని.. మరి ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఏమైందని ప్రశ్నించారు. రూ.11 కోట్లకు కక్కుర్తి పడి.. ఈ సంస్థ మహారాష్ట్రకు తరలిపోయేలా చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేశారని అన్నారు. ఆయన పర్యటనల వల్లే రాష్ట్రానికి కియా, హీరో, ఇసుజు వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయని తెలిపారు. అంతేగాక, త్వరలోనే బెల్, డెల్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా రాబోతున్నాయని వివరించారు.