బాబుపై పిటిషన్ జగన్ కుట్రలో భాగమే: యనమల, డొక్కా ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: మేనేజ్ చెయ్యడంలో చంద్రబాబును మించినోడు లేడన్న వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యాఖ్యలపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ, చట్టాలు, దర్యాప్తు సంస్థలపై జగన్కు ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు.
మేనేజ్ చెయ్యడంలో చంద్రబాబును మించినోడులేడన్న జగన్ వ్యాఖ్యలు హైకోర్టును ధిక్కరించడమే అని పేర్కొన్నారు. న్యాయస్థానాలపై జగన్ అపవాదు వేయడం దారుణమని అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా న్యాయస్థానాలు, జడ్జిలపై జగన్ నోరు పారేసుకున్నారని గుర్తు చేశారు.
కాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, నిధుల కోసం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చేస్తున్న ప్రయత్నాలను జగన్ వక్రీకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా ఏసీబీ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుపై పిటిషన్ వేయించడం జగన్ కుట్రలో భాగమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ప్యాకేజీ తీసుకుని హోదాపై పోరు సాగిద్దాం: మాజీ మంత్రి డొక్కా
కేంద్రం ఇచ్చే ప్కాకేజీని తీసుకుని హోదాపై పోరు సాగిద్దామని టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతుంటే, దానిని వద్దనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
కేంద్రం ఇస్తామంటున్న దానిని తిరస్కరిస్తే.. వస్తుందనుకున్న దానిపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఇచ్చిన దానిని తీసుకోకుండా రాని దాని కోసం పోరాటం చేస్తే నష్టం జరిగే ప్రమాదముందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో, ప్రత్యేక ప్యాకేజీ కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పక్షంలో ఉండి కూడా విపక్షాల కంటే దీటుగా తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఏపీకి కేంద్రం భారీ ప్యాకేజీని ఇచ్చేందుకు ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు మీడియాలో గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications