విభజనకు జగన్ సై, రాజీనామాలు అందుకే: యనమల
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటనల గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముందే ప్రకటనలు చేస్తున్నారని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముందే తెలుసునని అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
విభజన తీర్మానం ఆమోదం పొందడం కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాజీనామాలు చేశారని ఆయన ఆరోపించారు. విభజనకు సహకరిస్తున్న జగన్ పార్టీలో కాంగ్రెస్ నేతలు ఎలా చేరతారని యనమల ప్రశ్నించారు. జగన్ విభజనకు అంగీకరించినందువల్లనే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ కేబినేట్ నోట్ను వేగవంతం చేసిందన్నారు.
పొత్తుల గురించి ప్రస్తుతం తమ పార్టీ ఆలోచించడంలేదని, తెలుగు జాతి మధ్య ఏర్పడ్డ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే తమ ఎజెండా అని ఆయన అన్నారు. వ్యతిరేక ఓటు విధానం ఉండాలన్న సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ మేరకు చట్టాలలో సవరణ చేయాలని యనమల కోరారు.
అక్టోబర్ 4వ తేదీన వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో రైతు సమస్యలపై ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. నిజానికి వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఆ ర్యాలీ అక్టోబర్ 1వ తేదీన జరగాల్సింది. కానీ వైయస్ జగన్ పాల్గొనడానికి వీలుగా దాన్ని నాలుగో తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.