రాజధానిపై మూర్ఖంగా మళ్ళీ చట్టం చేసినా ఇదే పరిస్థితి; రీజన్ చెప్పిన యనమల రామకృష్ణుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి అభివృద్ధి చేయాలని, అమరావతిలో ప్లాట్లను అభివృద్ధిపరిచి రైతులకు అందించాలని, రాజధాని విషయంలో చట్టం చేసే హక్కు శాసనసభకు ఉండదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ వైసీపీ సర్కార్ మూడు రాజధానులు ఏర్పాటు సుముఖంగా ఉన్నట్టు ఏపీ మంత్రుల వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

మళ్ళీ రాజధాని చట్టం తెచ్చినా ఇదే పరిస్థితి
తాజాగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజధాని పై మరో చట్టం తీసుకు రావడానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మళ్లీ రాజధానికి చట్టం తెచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన విభజన చట్టం ప్రకారం రాజధాని పై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉంది కానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. శాసనసభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

వైసీపీకి అధికార బలం, అహంకార మదం మాత్రమే ఉన్నాయి
ఇప్పటికైనా హైకోర్టు తీర్పును ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాజధానిగా అమరావతినే అంగీకరించి, అమరావతిని అభివృద్ధి చేయాలని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. మూర్ఖపు వైఖరితో అమరావతిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన బలం లేదని, అధికార బలం, అహంకార మదం మాత్రమే ఉన్నాయని యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల ఏర్పాటు కాదు
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కాదని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలకు సమానంగా బడ్జెట్ ను పంచి రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి అయ్యేలా చూడటం అని యనమల రామకృష్ణుడు హితవు పలికారు. వైసిపి మూడేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మాట్లాడితే అభివృద్ధి వికేంద్రీకరణ అని కబుర్లు చెబుతున్నారని వైసిపి నేతల తీరుపై మండిపడ్డారు.

రాజధాని అమరావతి పై జగన్ వైఖరి మార్చుకోవాలని హితవు
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వైసిపి పాలనలో ఏయే ప్రాంతాలలో పలు పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నుంచి ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోయాయని, కర్నూలు సోలార్ ప్లాంట్ ఆగిపోయిందని యనమల పేర్కొన్నారు. వైసీపీ నేతలు అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదానికి అర్థం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి పై జగన్ వైఖరి మార్చుకోవాలని యనమల రామకృష్ణుడు హితవుపలికారు.

వివేకా హత్య వెనుక కుట్ర.. జగన్ ప్రధాన భాగస్వామి
ఇదే సమయంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంపై మాట్లాడిన యనమల రామకృష్ణుడు వివేకా హత్య వెనక నేరపూరిత కుట్ర ఉందని, ఇందులో సీఎం జగన్ ప్రధాన భాగస్వామి అని ఆరోపించారు. నిందితుల జాబితాలో అవినాష్ రెడ్డి తో పాటు జగన్ పేరును కూడా చేర్చాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో వివేకా కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ సిబిఐకి వాంగ్మూలంలో ఇచ్చారని యనమల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications