విభజన చట్టంలో మార్చలేని తప్పులు, మీరు చంఢాలం చేస్తే శుభ్రం చేయాలా: జైరాంపై యనమల
అమరావతి: కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ పైన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ సీఎం చంద్రబాబుకు ముడుపులు అందాయని, ఆయన విదేశాల్లో ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరాం ఆరోపించారు. దీనిపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై జైరాం రమేశ్ చేసిన ఆరోపణలను ఖండించారు. తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. విభజనలో జైరాం రమేశ్ ఆడిన డ్రామా ప్రజలు మరిచిపోలేదని మండిపడ్డారు. విభజన కపట నాటక సూత్రధారి ఆయనే అన్నారు.

మీ డ్రామాలు ప్రజలకు తెలుసు కాబట్టే ఓడించారు
విభజన చట్టంలో మార్చలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు మార్చండి అనడం ఏమిటని యనమల ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలు ఆడినందువల్లే ఏపీ, తెలంగాణలలో ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ధ్వజమెత్తారు. చట్టంలో యాజ్ ఫర్ ఫీజిబిలిటీ, విల్ అబ్జర్వ్, షల్ ఎగ్జామిన్ పదాలన్నీ జైరాం నిర్వాకాలే అన్నారు.

మేం చండాలం చేశాం, మీరు శుభ్రం చేయండి అంటారా
మేము ఛండాలం చేశాం, మీరు శుభ్రం చేయండి అనడం జైరాం రమేష్ నైజానికి నిదర్శనమని యనమల అన్నారు. ఏపీ వారిని అవహేళన చేయడం జైరామ్ మానుకోవాలని హితవు పలికారు. రెండుసార్లు రాజ్యసభకు పంపి, కేంద్రమంత్రి అయ్యేందుకు అవకాశమిచ్చిన ఏపీకి ఆయన తీరని ద్రోహం చేశారన్నారు.

మేం పార్లమెంటులో పోరాడుతున్నాం
రాష్ట్రానికి న్యాయం చేయమని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు కనీసం పెదవి విప్పడం లేదని యనమల మండిపడ్డారు. ఏమాత్రం స్పష్టత లేని విభజన చట్టం ఘోస్ట్ రైటర్ అని, ఏపీ ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత జైరామ్దే అన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగా లోపభూయిష్ట చట్టం
ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టమైన చట్టం చేసి నవ్యాంధ్రకు తీరని అన్యాయం చేశారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా మార్చలేనంత అశాస్త్రీయంగా చట్టం చేశారన్నారు. జైరాంకు టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications