వైకాపా, కాంగ్రెసులదే బాధ్యత: తుని హింసపై గంటా, డిజిపి ఎమ్మన్నారు?
విజయవాడ: శాంతియుతంగా సాగాల్సిన కాపు గర్జనలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. రైల్రోకో, రాస్తారోకో వంటి ఆకస్మిక నిర్ణయాలు సరికావని హితవు పలికారు. ఇలాంటి నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.

కాపులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని హోంమంత్రి చినరాజప్ప కోరారు. కాపు గర్జన హింసాత్మకంగా మారడం దురదృష్టకరమని అన్నారు.
సమావేశమని చెప్పి విధ్వంసానికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రామాడు తుని సంఘటనలపై అన్నారు. అదనపు బలగాలు తునికి చేరుకుంటున్నాయని ఆయన చెప్పారు. కొంత మంది కావాలనే విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేస్తున్న సంయమనం పాటిస్తున్నారని చెప్పారు.
మీడియా, పోలీసు స్టేషన్పై ఆందోళనకారులు దాడి చేసినట్లు ఆయన తెలిపారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన నాలుగు బోగీలు దగ్ధమైనట్లు తెలిపారు. తునిలోని పరిస్థితులను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆందోళనకారులను వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భద్రత పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల అదనపు డీజీ తెలిపారు. తుని ప్రాంతానికి అదనపు బలగాలు తరలించినట్లు చెప్పారు. సివిల్ పోలీసులు, ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, పారా మిలటరీ బలగాలు మోహరించినట్లు తెలిపారు. అన్ని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆందోళనకారులు విజయవాడ వద్ద చెన్నై - కోల్కతా జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. తమ డిమాండ్ను సాధించుకునే వరకు వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రోడ్డు రోకోకు పిలుపునివ్వడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు భావిస్తున్నారు.
రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను బస్సుల ద్వారా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, రోడ్లన్నీ దిగ్బంధం కావడంతో బస్సుల ద్వారా వారిని తరలించడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications