ఆ విషయంలో చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ .. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో ను విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు వైసిపి నాయకులు. టిడిపి మేనిఫెస్టో పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరారు .

టీడీపీ పంచాయతీ ఎన్నికల మ్యానిఫెస్టోపై వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి ఫిర్యాదు
ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది . అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు మాటలయుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి మరొకరు ఎత్తులు , పై ఎత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు . ఇక తాజాగా టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం , టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలు నిలవటం కోసం మ్యానిఫెస్టో విడుదల చేశారు . టిడిపి మేనిఫెస్టో పై వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి సాయిరాం ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారని ఫిర్యాదు
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారంటూ వైసిపి లీగల్ సెల్ కార్యదర్శి సాయిరాం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఉపక్రమించవలసిందిగా ఆయన తన ఫిర్యాదు ద్వారా విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే.పల్లె ప్రగతి పంచసూత్రాలు పేరుతో చంద్రబాబు పల్లెలు మళ్లీ వెలగాలి అన్న నినాదంతో టిడిపి నుండి బరిలోకి దిగే అభ్యర్థులను గెలిపించాలని వారు గెలిస్తే గ్రామాల స్వయంసమృద్ధి కోసం కృషి చేస్తారని తమ మేనిఫెస్టో ద్వారా తెలియజేశారు.

ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇక ఇదే విషయాన్ని వైసిపి తప్పు పడుతుంది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో , పార్టీల ప్రమేయమే లేకుండా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలలో పార్టీ మేనిఫెస్టో పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్సా సత్యన్నారాయణ తదితరులు చంద్రబాబు మేనిఫెస్టో పై ఇప్పటికే విరుచుకుపడగా , తాజాగా వైసిపి లీగల్ సెల్ నుండి చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications