విభజనతో ఏపీ నష్టపోయిందని ఎలా అంటారు, టీలో..: వైసీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంగళవారం నాడు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హాట్ హాట్గా చర్చ సాగింది. వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్ర నాథ్ మాట్లాడుతూ.. 7.2 వృద్ధి రేటు ఉందని గత సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, అలాంటప్పుడు ఏపీలో లోటు ఉందని ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విభజనతో ఏపీ నష్టపోయిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలోనే వృద్ధి రేటు 5.2గా ఉందన్నారు. ఆ వ్యాఖ్యలకు కృష్ణమూర్తి అడ్డుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాఠాలు చెప్పించుకునే పరిస్థితి తమకు రాలేదని వ్యాఖ్యానించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడింది వైయస్సే అన్నారు. రాజకీయ కక్షతోనే నాడు చంద్రబాబు పైన అనేక కేసులు పెట్టారన్నారు.

జగన్ వర్సెస్ నరేంద్ర
రాజకీయాల్లోకి వచ్చినపుడు చంద్రబాబు ఆస్తి రెండున్నర ఎకరాలని, ఇప్పుడు వేల కోట్లకు ఆస్తి ఎలా పెరిగిందని జగన్ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ హత్యా రాజకీయాలతోనే వైఎస్ కుటుంబం పైకి వచ్చిందని జగన్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. వైయస్ చరిత్ర అందరికీ తెలుసునని నరేంద్ర అన్నారు. జగన్ అవినీతిలోనే కాదు నటనలో కూడా పండిపోయాడని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి అన్నారు.
తప్పుడు పనులు చేయను: చంద్రబాబు
రాష్ట్రానికి అన్యాయం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలా తప్పుడు పనులు చేయనని, తప్పుడు పనులు చేసేవారిని ఉపేక్షించనని అంతకుముందు చంద్రబాబు చెప్పారు. వైయస్ అవినీతిపై రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ప్రచురించి కేంద్రానికి ఇచ్చామని, అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టానన్నారు. 16 సంవత్సరాలు అధికారంలో ఉన్నా, నీతినిజాయితీగా ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications