అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్న బాబు, రియల్ ఎస్టేట్ బ్రోకరా?...స్టాక్ బ్రోకరా?: శ్రీకాంత్
హైదరాబాద్:అమరావతి బాండ్ల విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి తప్పుబట్టారు. చంద్రబాబు అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.
సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అమరావతి బాండ్ల విషయంలో చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. అమరావతి బాండ్లకు 10 శాతానికి మించి వడ్డీ ఇస్తున్నారని...ఇది సరికాదని...చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా?... లేక స్టాక్ బ్రోకరా?...అని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయి ఆస్తులు తగ్గినమాట వాస్తవం కాదా?...అని ప్రశ్నించారు.
ఏపీలోని 5 కోట్ల మంది తెలుగు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి చంద్రాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు బినామీలు ఉన్న చోటే అభివృద్ది కోసమనే నెపంతో నిధులు ఇస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అయినా అభివృద్ది అనేది కేవలం రాజధాని ప్రాంతంలో చేస్తే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు కనబడటం లేదా అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.
చంద్రబాబు సెక్యూరిటీ కోసం నెలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అని నిలదీశారు. చంద్రబాబు ,టిడిపి నేతలు సొంత ఖర్చుల కోసం కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ఆయన విమర్శించారు. నీరు చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు 13 కోట్ల రూపాయలు దోచుకున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము టిడిపి ప్రభుత్వానికి ఉందా?...అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు బీఎస్ఈలో గంట కొట్టడానికి ముంబై వెళ్లారని...కానీ రానున్న రోజుల్లో చంద్రబాబు నెత్తిన ప్రజలే గంట కొడతారని ఆయన ఎద్దేవా చేశారు.