వైసీపీ సీనియర్లలో అసహనం: టీటీడీలోనూ పట్టించుకోలేదు :సీఎం జగన్ వారికే ఎందుకిచ్చారంటే..!!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు సీనియర్లు అసహనంతో కనిపిస్తున్నారు. నాడు కేబినెట్ కూర్పులో అవకాశం ఇవ్వలేదు. రెండున్నారేళ్లు సమయం చెప్పారు. సామాజిక సమీకరణాల పేరుతో మంత్రి మండలి ఏర్పాటు చేసారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు తగిన ప్రాధాన్యత కల్పించలేదు. ఇక..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంఖ్య పెంచుతున్నారు..అందులో అయినా అవకాశం వస్తుందని భావిస్తే అక్కడా నిరాశే మిగిలింది. జగన్ పార్టీ స్థాపించిన సమయం నుండి ఆయనతో పాటు ఉన్న సీనియర్లకు ఇప్పటికీ గుర్తింపు దక్కటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక..టీటీడీలో పార్దసారధి కి బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల కన్నబాబు..మేడా మల్లిఖార్జున రెడ్డి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారే అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వారికి అవకాశం ఇవ్వటం కోసం ఏకంగా బోర్డు సంఖ్యను పెంచారు. భూమనకు సైతం ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇవ్వటం పైనా చర్చ సాగుతోంది. మహిళలకు ముగ్గురికే ఇవ్వటం అందునా..ఏపీకి చెందిన ఒక్కరికే అవకాశం ఇవ్వటం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
టీటీడీలో వారి మాటలకే ప్రాధాన్యత..
ముఖ్యమంత్రి జగన్ టీటీడీ చైర్మన్ బాబాయ్ సుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చారు. మూడు నెలల తరువాత బోర్డు ఏర్పాటు చేసారు. దాదాపు 35 మందితో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసినప్పటి నుండి పార్టీలోని సీనియర్లు తమకు మంత్రి పదవులకు కారణాలు చెప్పినా..ప్రతిష్ఠాత్మకమైన టీటీడీలో అయిన అవకాశం ఇస్తారని భావించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు..పార్టీ నేతలకు అవకాశం ఎక్కువగా దక్కేది. అదే విధంగా తమిళనాడు..కర్నాటక..మహారాష్ట్ర..తెలంగాణ నుండి మాత్రమే ఇతరులకు అవకాశం ఇచ్చేవారు. అయితే..ఇప్పుడు ఏపీకి చెందిన వారి కంటే ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యత లభించింది. అందునా తెలంగాణ ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన వారికి ఛాన్స్ దక్కింది. ఇక..పారిశ్రామిక వేత్తలకు సైతం ప్రయార్టీ ఇచ్చారు. ఏపీ నుండి కేవలం ఎనిమిది మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులుగా..మరో ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆహ్వానితుడిగా..మరో ఎమ్మెల్యేకు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించారు. ఇక..అసెంబ్లీలో ఆమోదించిన 50 శాతం రిజర్వేషన్లు ఇక్కడ అమలు కాలేదు. దీంతో..అప్పుడు మంత్రి పదవులు రాక..నామినేటెడ్ పదవుల్లో ఇతరకు ప్రాధాన్యత ఇస్తూ..టీటీడీలో సైతం ఏపీ నుండి కాకుండా ఇతర ప్రాంతాల వారికి అసవరానికి మించి ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జగన్ వారికే ఎందుకిచ్చారంటే..
టీటీడీ బోర్డు ఏర్పాటు సమయంలో తన మీద తీవ్ర ఒత్తిడి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారు. అందు కోసమే బోర్దు ఏర్పాటు ఆలస్యం అయింది. గత ప్రభుత్వ హాయంలో బోర్డు సభ్యుడిగా ఉంటూ పెద్ద నోట్ల రద్దు తరువాత పెద్ద మొత్తంలో నగదు దొరికి వివాదాస్పదం అయిన శేఖర్ రెడ్డికి తిరిగి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చారు. ఇక.. అమిత్ షా సిఫార్సు మేరకు క్రిష్ణమూర్తికి...డీఎంకే అధినేత స్టాలిన్ రికమండేషన్ తో డాక్టర్ నిశ్చిత..నిర్మలా సీతారామన్ సిఫార్సుతో అనంత.. స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచన మేరకు సుబ్బారావు.. రాష్ట్రపతి భవన్ సిఫార్సు మేరకు శివశంకరన్.. కేంద్ మంత్రి ప్రహ్లాద్ జోషి రికమండేషన్ తో రమేశ్ శెట్టి..ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సులో పలువురు స్థానం దక్కించుకున్నారు. వ్యాపార ప్రముఖులు జూపల్లి రామేశ్వరరావు, పార్ధసారధి రెడ్డి, శ్రీనివాసన్, దామోదర రావు వంటి వారికి ఖరారు చేసారు. దీంతో..బీజేపీ సైతం టీటీడీ బోర్డు నియామకం మీద నిరసనలు వ్యక్తం చేస్తోంది. అయితే..తమ పార్టీ అగ్రనేతలు చేసిన సిఫార్సులతోనే వారికి టీటీడీలో అవకాశం వచ్చిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు విస్మరిస్తున్నారు. ఇతర పార్టీల నేతల సిఫార్సులకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా తమ పార్టీకి చెందిన వారికి అవకాశం లేకుండా చేసారు. ఇదే ఇప్పుడు పార్టీలోని సీనియర్లకు నచ్చటం లేదు. ఇక..కొద్ది రోజులుగా ఖరారు చేస్తున్న నియమకాల్లోనూ ఒకే రకమైన భావన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు వరుసగా ఈ నియామకాలు పార్టీలో చర్చలకు..సీనియర్లలో అసహనానికి కారనం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications