అవంటే ఎందుకు చంద్రబాబుకి భయం...అంబులెన్స్ సౌండ్ విన్నా గజగజా వణుకు:అంబటి రాంబాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. దర్యాప్తు సంస్థలంటే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని సిఎం చంద్రబాబు అనడాన్ని అంబటి తప్పుబట్టారు. ఒకవైపు ఐటీ అధికారులకి సెక్యూరిటీ ఉపసంహరించుకున్నట్లు చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వడం..మరో వైపు చంద్రబాబు అనుకూల మీడియా విష ప్రచారం సాగించడం దేనికి సంకేతమని నిలదీశారు.
నిప్పుకు...ఎందుకు భయం?
"నిప్పునని చెప్పుకునే వ్యక్తి ఎందుకు వణికిపోతున్నారు...కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు...ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది...కట్టల కట్టల డబ్బు చంద్రబాబు బినామీల దగ్గర ఉంది...అదంతా బయటికి తీయాలని ఐటీ డిపార్ట్మెంట్ అధికారులను కోరుతున్నాను...ధర్మాబాబ్ కోర్టు బాబ్లీ కేసు విషయంలో చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్లి నిరూపించుకోవాలి...చట్టం అంటే అసలు గౌరవం లేని ఆర్థిక ఉగ్రవాది నారా చంద్రబాబు నాయుడు"...అని అంబటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఈడీ దాడులు సహజమని...కానీ చంద్రబాబు తీరు చూస్తుంటే అసలు దర్యాప్తు సంస్థల దాడులే వద్దు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ఆ సౌండ్ విన్నా...గజగజా వణుకు
చంద్రబాబు నాయుడు అంబులెన్స్ వ్యాన్ సౌండ్ విన్నా కూడా పోలీస్ వ్యాన్ అనుకుని భయంతో గజగజా వణికిపోతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు విపత్కరంగా మారాయని...ఐటీ దాడులు జరిగితే ప్రజలకు నష్టమా లేక టీడీపీ నాయకుల నష్టమా స్పష్టంగా చెప్పాలని అబటి రాంబాబు డిమాండ్ చేశారు. అయితే ఇదే ఈడీ సంస్థ గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్థల్లో దాడులు నిర్వహిస్తే ఎల్లో పత్రికలు ఈడీ దాడులను భేష్ అన్నట్లు రాశాయని అంబటి గుర్తుచేశారు. అయితే ఈడీ దాడులు చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలపై జరిగితే అవే ఎల్లో పత్రికలు ఎలా రాస్తున్నాయో ప్రజలు గమనించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
చట్టాలకు...అతీతమా?...
ఈడీ పంజా, మోడీ చెబితే దాడి అంటూ ఆ ప్రతికలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి ఇలా దర్యాప్తు సంస్థల పేరును భ్రష్టు పట్టించేలా రాస్తున్నాయన్నారు. కేసీఆర్ తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని అన్నారని...ఆ హెచ్చరికలపై చంద్రబాబు బయటకొచ్చి కేసీఆర్ని ఎందుకు సవాల్ చేయటం లేదని అంబటి ప్రశ్నించారు. కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయం ఎందుకు అన్నారు. టీడీపీ అయినా, చంద్రబాబు అయినా చట్టాలకు లోబడే ఉండాలని, చట్టాలకు చంద్రబాబు అతీతుడేమీ కాదన్నారు.
చంద్రబాబు...మనీ పాలిటిక్స్
చంద్రబాబువి మనీ పాలిటిక్స్ అన్న అంబటి..."అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎన్నికల ఖర్చు అధికం...దీనికి కారణం చంద్రబాబే. ఏపీలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ చంద్రబాబు, టిడిపిలోకి తీసుకువచ్చి విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ మీ పాత మిత్రుడు పవన్ కల్యాణే చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.20 కోట్లు సిద్ధంగా ఉంచామని లోకేష్, పవన్ కల్యాణ్తో అన్నారని చెప్పలేదా?...నారాయణ, సీఎం రమేష్, సుజానా చౌదరీ రాజకీయ నాయకులా? ...ఆర్థిక నేరస్తులు అందరినీ పార్టీలోకి తీసుకుని చంద్రబాబు డబ్బులు వెదజల్లుతున్నారు...బినామీలను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు"...అని ధ్వజమెత్తారు.