అరాచకాలు ప్రశ్నిస్తే దళిత జడ్జీపైనే దాడి, ఆ రూ.5.27 కోట్లు ఎవరివీ, జగన్ సర్కార్పై లోకేశ్ ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. రాజారెడ్డి రాజ్యాంగంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై జరిగిన రెండు ఘటనలను నారా లోకేశ్ ప్రస్తావించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులను ముక్తకంఠంతో ఖండించారు. వైసీపీ వ్యతిరేక విధానాలపై రాజీలేకుండా పోరాడుతామని స్పష్టంచేశారు.
దాడి హేయనీయం..
చిత్తూరు జిల్లా న్యాయమూర్తి రామకృష్ణపై దాడి చేసింది వైసీపీ శ్రేణులు అని లోకేశ్ ఆరోపించారు. భౌతికదాడి చేయడమే కాదు బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రామకృష్ణ దళితుడు కావడంతో దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. వైసీపీ నేతల అరాచకాలను బయటపెడుతున్నందుకే అటాక్ చేశారని ఆరోపించారు.
అనంతలో ఇలా..
అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని లోకేశ్ మండిపడ్డారు. దళిత రైతులపై దాడి చేసి భూములను లాక్కొనే ప్రయత్నం చేశారని తెలిపారు. అదేరోజు చిత్తూరు జిల్లాలో దళితుడు అయిన రామకృష్ణపై దాడి చేశారని గుర్తుచేశారు. జగన్ రెడ్డి రాక్షస పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వరసగా జరుగుతున్న దాడులు ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.
దళితులే టార్గెట్
రామకృష్ణపై దాడిని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఖండించారు. దళితులే టార్గెట్గా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే.. రామకృష్ణపై దాడి చేయడం దారుణమన్నారు. రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ను డిమాండ్ చేశారు.

అవినీతికి నిదర్శనం..?
తమిళనాడులో పట్టుబడ్డ కారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరుతో స్టిక్కర్ ఉండటంతో.. జగన్ అక్రమాలకు నిదర్శనం అని లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జగన్ ఇసుక, భూమి, మందు పొరుగు రాష్ట్రంలో దొరికిపోయిందన్నారు. అందులో రూ.5.27 కోట్ల నగదు ఉంది అని లోకేశ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న మద్యాన్ని పట్టుకొని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందన్నారు. కానీ పక్క రాష్ట్రాలకు తరలిస్తోన్న అక్రమ సొమ్ము సంగతేంటి అని లోకేశ్ ప్రశ్నించారు.

సంబంధం లేదు..
తమిళనాడులో పట్టుబడ్డ కారు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టిక్కర్ అతికించి ఉంది. వ్యాపారవేత్త అయిన రాంబాబు.. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. కారులో నగదు, బంగారానికి సంబంధించి లెక్కచూపకపోవడంతో ఇవాళ ఉదయం పట్టుకున్నారు. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. నగదు, బంగారంతో పార్టీకి, ఎమ్మెల్యేకు సంబంధం లేదు అని స్పష్టంచేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం కారు ఎమ్మెల్యే రాంబాబుదేనని ఆరోపిస్తున్నారు.

ప్రశ్నిస్తే అరెస్ట్..
మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్పై అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు. అవినీతికి సహకరించలేదని డాక్టర్ అనితారాణిని వేధించారని గుర్తుచేశారు. కచ్చులూరు బోటు ప్రమాదం వెనక వాస్తవాల బయటపెడితే మాజీఎంపీ హర్షకుమార్ను వేధించారని మండిపడ్డారు. అధికారం ఉందని బలహీనవర్గాలపై దాడులు చేయడం, దళితుల భూములు లాక్కుంటున్నారని.. ఇందుకు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications